మైల‌వ‌రం ప్ర‌జ‌ల‌కు దేవినేనే కావాల‌ట‌.. రీజ‌నేంటంటే!

Devineni Uma
Devineni Uma

టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ మంత్రి దేవినేని ఉమామ‌హేశ్వ‌ర‌రావు రాజ‌కీయాలు పుంజుకున్నాయ‌నే టాక్ వినిపిస్తోంది. ఏడాదిన్న‌ర కింద‌ట జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఆయ‌న ఓడిపోయారు. దీనికి ముందు జ‌రిగిన ఎన్నిక‌ల్లో వ‌రుస విజ‌యాలు సాధించ‌డంతోపాటు.. పార్టీని బ‌లోపేతం చేశారు. సుదీర్ఘ రాజ‌కీయ ప్ర‌స్థానం ఉన్న దేవినేని కుటుంబం నుంచి వ‌చ్చిన ఉమా.. పార్టీలో కీల‌క రోల్ పోషిస్తున్న విష‌యం తెలిసిందే. 2014 ఎన్నిక‌ల్లో సాధించిన విజ‌యం .. ఆయ‌న‌కు మంత్రి ప‌ద‌విని కూడా తీసుకువ‌చ్చింది. అయితే.. క‌మ్మ సామాజిక వ‌ర్గాన్ని ప‌ట్టించుకోవ‌డం లేద‌నే ఆరోప‌ణ‌లు ఆయ‌న‌పై వెల్లువెత్త‌డంతోపాటు.. మంత్రిగా బిజీగా ఉండ‌డంతో నియోజ‌క‌వ‌ర్గానికి కూడా దూరంగా ఉండ‌డం మైన‌స్ అయింది.

ఈ నేప‌థ్యంలో గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో వ్య‌తిరేక ప‌వ‌నాలు వీచాయి. దీనికి వైఎస్ జ‌గ‌న్ పాద‌యాత్ర గాలి కూడా సోకింది. అదే స‌మయంలో మాజీ మంత్రి వసంత నాగేశ్వ‌ర‌రావు త‌న‌యుడు.. త‌మ‌కు అన్ని విధాలా అండ‌గా ఉంటార‌ని భావించిన క‌మ్మ వ‌ర్గం ఆయ‌న‌తో చేతులు క‌లిపి.. మొత్తానికి ఉమా ఓట‌మికి దారితీసే ప‌రిస్థితులు ఏర్ప‌డ్డాయి. వ‌సంత కృష్ణ ప్ర‌సాద్ ఇక్క‌డ విజ‌యం సాధించారు. ఇంత వ‌ర‌కు బాగానే సాగింది. అయితే… ఏడాదిన్న‌ర స‌మ‌యంలోనే కృష్ణ‌ప్ర‌సాద్‌పై ఇక్క‌డ వ్య‌తిరేక‌త రావ‌డం గ‌మ‌నార్హం. ఆయ‌న ప్ర‌జ‌ల‌కు దూరంగా ఉంటున్నార‌నేది ప్ర‌ధాన విమ‌ర్శ‌. అదే స‌మ‌యంలో త‌మ‌కు అండ‌గా ఉంటార‌ని భావించిన క‌మ్మ వ‌ర్గంలోనూ ఆయ‌న‌పై ఆశ‌లు స‌న్న‌గిల్లాయి. త‌మ‌ను ప‌ట్టించుకోవ‌డంలేద‌ని, కేవ‌లం జ‌గ‌న్ భ‌జ‌న చేయ‌డంతోనే ఆయ‌న స‌రిపెడుతున్నార‌ని అంటున్నారు.

మ‌రీ ముఖ్యంగా మూడు రాజ‌ధానుల ఏర్పాటును వ్య‌తిరేకిస్తున్న ప్ర‌జ‌ల‌కు ఆయ‌న స‌మాధానం చెప్ప‌లేక పోతున్నారు. ఇక‌, వీరి వాద‌న‌ను కూడా ప్ర‌భుత్వానికి వినిపించ‌లేక మౌనం పాటిస్తున్నారు. వీటికితోడు నియోజ‌క‌వ‌ర్గంలో పెండింగ్‌లో ఉన్న ప‌నుల‌ను కూడా ఆయ‌న పూర్తి చేయించ‌లేక పోతున్నార‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. మ‌రోవైపు దేవినేని ఉమా.. దూకుడుగా ముందుకు సాగుతున్నారు. త‌న వ‌ల్ల జ‌రిగిన లోపాల‌ను స‌రిచేసుకునే ప్ర‌క్రియ‌కు ఆయ‌న శ్రీకారం చుట్టి.. త‌న‌కు దూర‌మైన క‌మ్మ నాయ‌కుల‌ను ఏకం చేసేందుకు , త‌న‌వైపు తిప్పుకొనే ప్ర‌య‌త్నాల‌ను ముమ్మ‌రం చేశారు.

ఫ‌లితంగా ఆయ‌న‌కు సానుకూల ప‌వ‌నాలు పెరిగాయి. వీటికితోడు పార్టీలో ఇటీవ‌ల ప్ర‌క‌టించిన ప‌ద‌వులు కూడా ఆయ‌న‌కు ల‌భించ‌క‌పోవ‌డం సానుభూతికి దారితీసింది. ఇలా మొత్తంగా ఏడాదిన్న‌ర కాలంలోనే దేవినేని పుంజుకున్నార‌నే టాక్ వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి వ‌చ్చే ఎన్నిక‌ల‌కు మూడున్న‌రేళ్ల స‌మ‌యం ఉంది క‌నుక అప్ప‌టి లోగా ఆయ‌న మ‌రింత‌గా త‌న సైన్యాన్ని కూడ‌గ‌ట్టుకుంటే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తిరిగి ఆయ‌న విజ‌యం సాధించ‌డం ఖాయ‌మేన‌నే అంచ‌నాలు వ‌స్తున్నాయి. మ‌రి ఏం చేస్తారో చూడాలి.