రాజశేఖర్-నీలకంఠ.. పట్టుకున్నది ఆ సినిమానా?

సీనియర్ హీరో రాజశేఖర్ ఇటీవలే కరోనా నుంచి కోలుకున్నారు. ఒక దశలో ప్రాణాపాయ స్థితికి వెళ్లిన ఆయన గురించి అభిమానులు తీవ్ర ఆందోళన చెందారు. అదృష్టవశాత్తూ ఆయన ఆ స్థితి నుంచి కోలుకున్నారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం ఆయన సంపూర్ణ ఆరోగ్యవంతుడయ్యే ప్రయత్నంలో ఉన్నారు. ఇంకొన్ని రోజుల్లోనే ఆ స్థితికి చేరతాడని అంటున్నారు. పూర్తిగా కోలుకున్నాక కొత్త ఏడాదిని కొత్త సినిమాతో ఆరంభించాలని ఆయన కోరుకుంటున్నారు.

‘షో’తో జాతీయ అవార్డు గెలిచిన విలక్షణ దర్శకుడు నీలకంఠ డైరెక్షన్లో ఓ సినిమా చేయడానికి రాజశేఖర్ కమిట్మెంట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనికి నిర్మాతలు కూడా కుదిరారు. రాజశేఖర్ వైపు నుంచి కూడా ఈ సినిమాకు ఫినాన్షియల్ బ్యాకప్ ఉంటుందని తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర సమాచారం బయటికి వచ్చింది.

రాజశేఖర్, నీలకంఠ చేయబోయేది స్ట్రెయిట్ మూవీ కాదట. రీమేక్ అట. మలయాళంలో రెండేళ్ల కిందట పెద్దగా అంచనాల్లేకుండా విడుదలై పెద్ద విజయం సాధించిన ‘జోసెఫ్’ను ఈ జోడీ తెలుగులో అందించబోతోందట. ఈ సినిమాలో అంతగా పేరున్న నటులేమీ నటించలేదు. జోజు జార్జ్ అనే క్యారెక్టర్ ఆర్టిస్ట్ లీడ్ రోల్ చేశాడు. ఇదొక ఇన్వెస్టిగేషన్ క్రైమ్ థ్రిల్లర్. నలుగురు రిటైరైన పోలీస్ ఆఫీసర్ల చుట్టూ కథ నడుస్తుంది.

షాబు కబీర్ అనే రచయిత తన నిజ జీవిత అనుభవాల నేపథ్యంలో ఈ కథ రాయగా.. పద్మకుమార్ ఆద్యంతం ఉత్కంఠ రేపేలా ఈ సినిమాను రూపొందించాడు. మూడున్నర కోట్ల బడ్జెట్లో తెరకెక్కిన ఏడెనిమిది రెట్ల తెచ్చిపెట్టిందీ చిత్రం. ‘జోసెఫ్’ కొన్ని అవార్డులు కూడా గెలిచింది. ఈ సినిమాలో నటనకు గాను కేరళ ప్రభుత్వం జోజును ఉత్తమ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఎంపిక చేసింది. జాతీయ అవార్డుల సందర్భంగానూ ఆయనకు ప్రత్యేక ప్రశంసలు దక్కాయి. ఈ నడి వయసు పాత్రలో రాజశేఖర్ ఎలా మెప్పిస్తాడో.. నీలకంఠ దర్శకుడిగా తన ముద్రను ఎలా చూపిస్తాడో చూడాలి.