నిర్మాతలిలా ఉంటే.. హీరోలెలా తగ్గుతారు బాబూ?

కరోనా కారణంగా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న రంగాల్లో ఫిలిం ఇండస్ట్రీ ఒకటి. సినిమాల రిలీజ్ లేదు. షూటింగులు ఆగిపోయాయి. ప్రేక్షకులేమో ఓటీటీలకు బాగా అలవాటు పడిపోతున్నారు. ఈ నేపథ్యంలో రాబోయే ఏడాది కాలం పరిశ్రమకు గడ్డు పరిస్థితులు తప్పేలా లేవు.

మళ్లీ ఎప్పుడు మామూలు పరిస్థితులు నెలకొంటాయో తెలియట్లేదు. ఆల్రెడీ తీసిన సినిమాలు, తీస్తున్న సినిమాలు, తీయబోయే సినిమాల మీదా ఈ ప్రభావం గట్టిగానే ఉండబోతోంది.

‘ఆర్ఆర్ఆర్‌’కే తప్పదట
ఏ పరిస్థితుల్లో అయినా పరిశ్రమలో తొలి దెబ్బ పడేది నిర్మాత మీదే. లాక్ డౌన్ దెబ్బకు వాళ్ల మీద పడే భారాన్ని అంచనా వేయడం కష్టంగా ఉంది. ఈ పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో సినిమా నిర్మాణ రూపమే మారక తప్పని పరిస్థితి కనిపిస్తోంది. ఇంతకుముందులా ఇష్టానుసారం బడ్జెట్లు పెట్టే పరిస్థితి లేదు. సినిమాలకు బిజినెస్ చేసుకోవడం చాలా కష్టంగా మారబోతోంది.

రాజమౌళి తీస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ లాంటి మెగా ప్రాజెక్టు మీద కూడా ఈ ప్రభావం ఉంటుందని.. బడ్జెట్ దగ్గర, బిజినెస్ విషయంలో ఇబ్బందులు తప్పవని అంటున్నారు. లాక్ డౌన్ తర్వాత ఈ చిత్రానికి ఫైనాన్స్ సమస్యలు తలెత్తవచ్చని.. అలాగే ముందు చేసుకున్న డీల్స్ ప్రకారం డబ్బులు కట్టడం కష్టమే అని.. దీంతో దానయ్య ఇబ్బందిపడక తప్పదని అంటున్నారు. అలాంటిది మిగతా సినిమాల పరిస్థితేంటో చెప్పాల్సిన పని లేదు.

నిర్మాతల వేలం వెర్రితోనే సమస్య
ఈ గడ్డు పరిస్థితుల్ని అర్థం చేసుకుని హీరోలు సహా అందరూ పారితోషకాలు తగ్గించుకుని, బడ్జెట్లను నియంత్రణలోకి తెస్తే తప్ప మనుగడ కష్టమని అంటున్నారు అగ్ర నిర్మాత సురేష్ బాబు. కానీ ఆయన విన్నపాన్ని హీరోలు ఎంతమాత్రం మన్నిస్తారన్నది సందేహం. వాళ్లు ఆ దిశగా ఆలోచించినా నిర్మాతలు ఆగుతారా అన్నది ప్రశ్న. హీరోల పారితోషకాలు ఇష్టానుసారం పెరిగిపోవడానికి ప్రధాన కారణం నిర్మాతలే.

ఒకప్పట్లా కథను బట్టి కాంబినేషన్లు సెట్ చేసుకునే పరిస్థితి ఇప్పుడు లేదు. ముందు హీరో డేట్లు సంపాదించడం.. ఆ తర్వాత దర్శకుడిని ఎంచుకోవడం.. ఆపై కథ సహా మిగతా వ్యవహారాల మీద దృష్టిసారించడం.. ఇదీ వరస. హీరోల డేట్ల కోసం నిర్మాతలు పోటీ పడటం.. ఎంత పడితే అంత పారితోషకం ఆఫర్ చేయడం సాధారణమైపోయింది.

మహేష్ బాబు సుకుమార్ సినిమాను కాదనుకుని ‘సరిలేరు నీకెవ్వరు’ చేయడానికి ఇలాంటి ఆఫరే కారణం అనే వార్తలొచ్చాయి అప్పట్లో. తక్కువ సమయంలో ఈ సినిమాను పూర్తి చేసే అవకాశం ఉండటం, రూ.50 కోట్ల దాకా తన జేబులోకి వచ్చేలా ఉండటంతో ఎంతో శ్రమతో కూడుకున్న సుక్కు సినిమాను మహేష్ వదులుకున్నట్లుగా గుసగుసలు వినిపించాయి.

నిర్మాతల క్రేజును చూసి.. హీరోలు ఇప్పుడు పారితోషకాలతో పాటు ప్రత్యేకంగా కాల్ షీట్లను అమ్ముకోవడం, తమ సొంత కారవాన్ల మెయింటైన్స్‌ ఖర్చు పేరుతో లక్షలు లక్షలు బిల్లు నిర్మాతలకు సమర్పించడం.. తమ వ్యక్తిగత పర్యటనల్ని కూడా నిర్మాతే భరించేలా చేయడం.. లాభాల్లో వాటా తీసుకోవడం.. ఇలా ఎన్నో చేస్తున్నారు. ఇదంతా నిర్మాతల వేలం వెర్రి పుణ్యమే.

వాళ్లు మారితేనే..
నిర్మాతలు కొంచెం కఠినంగా మారి తమ స్థాయిని నిలుపుకుంటే.. హీరోలకు ఎక్కడలేని ప్రాధాన్యం ఇవ్వడం.. కథ మీద కాకుండా కాంబినేషన్ల మీద దృష్టి పెట్టడం తగ్గిస్తేనే పరిశ్రమలో మార్పు వస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. హీరోల పారితోషకాల విషయంలో ఇండస్ట్రీలోని నిర్మాతలందరూ చర్చించుకుని ఓ నిర్ణయానికి వస్తే తప్ప పరిస్థితి మారకపోవచ్చు. ముందు హీరో డేట్ల కోసం, కమిట్మెంట్ కోసం ఎగబడి ముందు వెనుక చూడకుండా ‘ఆఫర్లు’ ఇవ్వడం మానుకోవాలని పరిశ్రమ పెద్దలంటున్నారు. కానీ నిర్మాతలు ఆగుతారా అన్నది ప్రశ్న?