జగన్ పై పెరిగిపోతున్న ఒత్తిడి

తన నిర్ణయాన్ని పునః సమీక్షించుకోవాల్సిన పరిస్దితి జగన్మోహన్ రెడ్డికి వచ్చింది. నూతన వ్యవసాయ సంస్కరణల చట్టానికి వ్యతిరేకంగా దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి మద్దతు పెరిగిపోతోంది. నూతన చట్టాన్ని వ్యతిరేకిస్తు ముందు పంజాబులో ఆందోళన మొదలైంది. తర్వాత ఆందోళన హర్యానాకు పాకింది. అక్కడి నుండి మహారాష్ట్ర, కర్నాటక, కేరళకూ పాకింది. మెల్లిగా పశ్చిమబెంగాల్, రాజస్ధాన్ రాష్ట్రాల్లోని రైతు సంఘాలు కూడా చేతులు కలుపుతున్నాయి. కాబట్టి జగన్ కూడా తన మద్దతు విషయాన్ని పునస్సమీక్షించుకోవాలంటు రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

ఇదే సమయంలో కేంద్రం తెచ్చిన చట్టానికి వ్యతిరేకంగా కేసీయార్ మాట్లాడటం జగన్ను బాగా ఇబ్బంది పెట్టేదే. కేసీయార్ మాట్లాడుతూ వ్యవసాయ చట్టానికి వ్యతిరేకంగా మంగళవారం నిర్వహించాలని అనుకున్న భారత్ బంద్ కు మద్దతు పలుకుతున్నట్లు చెప్పారు. కేంద్రం తెచ్చిన చట్టానికి వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఉద్యమానికి తమ సంపూర్ణ మద్దతుంటుందని కేసీయార్ ప్రకటించారు. ఇక్కడ కేసీయార్ వైఖరి రాజకీయంగా వ్యూహాత్మకమే కావచ్చు. కానీ పెరుగుతున్న రైతుల ఉద్యమాన్ని కూడా దృష్టి పెట్టుకున్నట్లే ఉంది.

కేసీయార్ ఎప్పుడైతే తన వ్యతిరేకతను బహిరంగంగా ప్రకటించారో అప్పటి నుండో జగన్ పై వ్యతిరేకత పెరిగిపోతోంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమింటే రెండు రాష్ట్రాల్లో ఏ విషయమైనా కానీండి ఒకచోట తీసుకుంటున్న నిర్ణయం ప్రభావం అనివార్యంగా రెండో రాష్ట్రంపైనా పడుతోంది. కేంద్రం చేసిన వ్యవసాయ చట్టం విషయంలో కూడా అదే జరుగుతోంది. ఎలాగూ భారత్ బంద్ కు కేసీయార్ మద్దతు ప్రకటించారు కాబట్టి తెలంగాణాలో రైతు సంఘాలు, వామపక్షాలతో పాటు వివిధ పార్టీల్లోని రైతు విబాగాలు స్వేచ్చగా బంద్ లో పాల్గొంటాయి.

మరి ఏపిలో ఏమి జరుగుతుంది ? జగన్ పాజిటివ్ నిర్ణయం తీసుకోని కారణంగా రైతు సంఘాలు, రాజకీయపార్టీల్లోని రైతు విభాగాలు బంద్ లో భాగంగా రోడ్డెక్కితే పోలీసులు ఊరుకోరు. కార్మిక సంఘాలు, బ్యాంకు ఉద్యోగుల సంఘాలు కూడా రైతుల ఆందోళనలకు మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. కాబట్టి భారత్ బంద్ లో భాగంగా రాజకీయపార్టీలు, కార్మిక, ఉద్యోగ సంఘాల నేతల విషయంలో ప్రభుత్వం ఎలా స్పందిస్తున్నది ఆసక్తిగా మారింది. ఈరోజు కాకపోయినా రేపైనా వ్యవసాయ చట్టాలపై జగన్ తన మద్దతు నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాల్సిన అవసరం వచ్చిందన్నది వాస్తవం.