వకీల్‍ సాబ్‍కి టెన్షన్‍ లేదు

థియేటర్లు తెరిచినా ప్రేక్షకులు కదిలి వస్తారా అనే ప్రశ్నకు సమాధానం దొరికేసింది. ఇంకా కరోనా విజృంభణ కొనసాగుతోన్న ఈ టైమ్‍లోనే థియేటర్లు తెరవగానే జనం బారులు తీరారు. సగం టికెట్లే అమ్మాలనే రూల్‍ని కచ్చితంగా పాటిస్తోన్న థియేటర్లకు మొదటి వారాంతంలో వచ్చిన స్పందనతో ఊరట లభించింది. ఈ ఆంక్షలు మరికొన్ని వారాల పాటు కొనసాగుతాయి కనుక ఈలోగా తక్కువ సినిమాలు విడుదల చేయాలని డిసైడ్‍ అయ్యారు.

అందరు నిర్మాతలకు, అన్ని సినిమాలకు సమ అవకాశాలు లభించేలా గిల్డ్ పెద్దలు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఇకపోతే ఏప్రిల్‍ నాటికి థియేటర్లు పూర్తి స్థాయిలో ఆపరేట్‍ అవుతాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అప్పటికి కరోనా తాకిడి ఎలా వున్నా కానీ జనం పెద్దగా పట్టించుకోరనేది స్పష్టమయింది. అయితే ఓవర్సీస్‍ మార్కెట్‍తోనే తంటా వచ్చి పడుతోంది. అక్కడ పరిస్థితులు మళ్లీ ఎప్పటికి మామూలు అవుతాయనేది అర్థం కావడం లేదు.

ఓవర్సీస్‍ మార్కెట్‍ సంగతెలా వున్నా పెద్ద సినిమాల విడుదల అయితే ఏప్రిల్‍ నుంచి మొదలవుతుంది. ఈ నేపథ్యంలో ఫస్ట్ బిగ్‍ రిలీజ్‍ పవన్‍ కళ్యాణ్‍ ‘వకీల్‍ సాబ్‍’ అవుతుంది. ఈ చిత్రాన్ని ఉగాది కానుకగా విడుదల చేయడానికి దిల్‍ రాజు సన్నాహాలు చేసుకుంటున్నట్టు తెలిసింది. పవన్‍ని వెండితెరపై చూడాలని ఎదురు చూస్తోన్న అభిమానులు తొలి వారంలో సినిమా టాక్‍తో సంబంధం లేకుండా థియేటర్లపై ఎగబడడం ఖాయమనిపిస్తోంది.