రైతుల ఎఫెక్ట్‌: వైసీపీ కూడా దోషేనా?

కేంద్రంలోని న‌రేంద్ర మోడీ ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చిన కొత్త వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను వెన‌క్కి తీసుకోవాల‌నే ప్ర‌ధాన డిమాండ్‌తో ఉత్త‌రాది రాష్ట్రాల నుంచి ప్రారంభ‌మైన రైతుల ఉద్య‌మం.. ఇప్పుడు మెల్ల‌మెల్ల‌గా దేశంలోని అన్ని రాష్ట్రాల‌కూ పాకింది. కార్పొరేట్ వ్య‌వ‌సాయాన్ని ప్రోత్స‌హించే ప్ర‌ధాన లక్ష్యంతో మోడీ స‌ర్కారు తీసుకువ‌చ్చిన‌.. ఈ చ‌ట్టాల‌ను వెన‌క్కి తీసుకోవాల‌నేది ఆయా రైతుల ప్ర‌ధాన డిమాండ్. అయితే .. ఇప్పుడు స‌రికొత్త అంశం తెర‌మీదికి తెచ్చింది.. మోడీ ప్ర‌భుత్వం. రైతుల సెగ త‌మ‌కు మాత్ర‌మే త‌గులు తోందని.. ప్రాంతీయ పార్టీలు.. రైతుల‌ను ఎగ‌దోస్తున్నాయ‌ని కేంద్రం భావిస్తోంది.

అంటే.. రైతుల నుంచి బీజేపీపై వ్య‌తిరేక‌త పెరుగుతోంద‌నే భావ‌న దేశంలో వ్యాపిస్తోంది. రైతు చ‌ట్టాల‌ను తీసుకువ‌చ్చిన మోడీ స‌ర్కారుకు రైతుల సెగ త‌ప్ప‌దంటూ.. పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు కూడా వ‌స్తున్నాయి. ఈ క్ర‌మంలో మోడీ స‌ర్కారు కీల‌క విష‌యాన్ని తెర‌మీదికి తెచ్చింది. పార్ల‌మెంటులో ఆయా రాష్ట్రాల ప్ర‌భుత్వాలు ఆమోదం తెలిపాయ‌ని.. ఈ చ‌ట్టాలు తీసుకురావ‌డంతో రాష్ట్రాల పాత్ర కూడా ఉంద‌ని ప్ర‌చారం చేయాల‌ని తాజాగా నిర్ణ‌యించింది. త‌మ‌కు త‌గులుతున్న రైతుల సెగ‌ను రాష్ట్ర ప్ర‌భుత్వాల‌పై కూడా నొట్టేందుకు.. రాజ‌కీయంగా వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించింది.

క‌ట్ చేస్తే.. ఇప్పుడు ఇదే ప్ర‌శ్న‌.. ఏపీ ప్ర‌భుత్వానికి కూడా త‌గులుతోంది. పార్ల‌మెంటులో రైతులకు సంబంధించిన కొత్త వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌పై చ‌ర్చ జ‌రిగిన‌ప్పుడు.. వైసీపీ స‌భ్యులు వీటిని ఎంతో కొనియాడారు. ముఖ్యంగా రాజ్య‌స‌భ‌లో 10 నిముషాల‌కు పైగా ఈ వ్య‌వ‌సాయ బిల్లుల‌పై మాట్లాడిన విజ‌య‌సాయిరెడ్డి.. ప్ర‌ధానిని అభిన‌వ రైతు బాంధ‌వుడిగా ఆకాశానికి ఎత్తేశారు. పార్ల‌మెంటులోనూ మిథున్ రెడ్డి.. త‌దిత‌ర ఎంపీలు.. ఈ వ్య‌వ‌సాయ బిల్లులు దేశ రైతాంగ భ‌విత‌వ్యాన్ని కీల‌క మ‌లుపు తిప్ప‌డం ఖాయ‌మ‌ని పేర్కొన్నారు. ఇలా.. అటు పెద్ద‌ల స‌భ‌, ఇటు లోక్‌స‌భ‌లోనూ వైసీపీ మ‌ద్ద‌తు ఇచ్చింది.

దీంతో ఇప్పుడు రైతుల ఉద్య‌మం విష‌యంలో ఎదుర‌వుతున్న ప్ర‌శ్న‌ల‌కు ఏం స‌మాధానం చెబుతుంది? అనేది కీల‌క ప్ర‌శ్న‌. ఇక‌, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ విష‌యానికి వ‌స్తే.. ఈ బిల్లుల‌పై చ‌ర్చ జ‌రిగిన‌ప్పుడు.. అటు లోక్‌స‌భ‌, ఇటు రాజ్య‌స‌భ కు కూడా ఈ స‌భ్యులు డుమ్మా కొట్ట‌డం గ‌మ‌నార్హం. కాబ‌ట్టి… టీడీపీ ఇబ్బందుల్లో ప‌డ‌లేదు. ఎటొచ్చీ.. మోడీకి అన్ని విధాలా వంత పాడుతున్న వైసీపీనే ఇప్పుడు అడ్డంగా బుక్క‌యింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.