వైర‌ల్ ఫొటో.. బీజేపీతో ఎంఐఎం దోస్తీ?

భార‌తీయ జ‌న‌తా పార్టీ.. ఎంఐఎం.. ఈ రెండు ఉప్పు నిప్పుల్లా ఉంటాయి ఎప్పుడూ. ఈ రెండు పార్టీల‌వి పూర్తి భిన్న‌మైన సిద్ధాంతాలు, విధానాలు. ఒక‌టంటే ఇంకోదానికి ప‌డ‌దు. ఇరు పార్టీల వాళ్లూ ఎప్పుడూ క‌ల‌హించుకుంటూనే ఉంటారన్న‌ది తెలిసిన సంగ‌తే. ఐతే జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల‌కు వ‌చ్చేస‌రికి ఈ రెండు పార్టీలు ఎవ‌రి స్థాయిలో వాళ్లు మ‌తం పేరు చెప్పి, జ‌నాల్ని రెచ్చ‌గొట్టి ఓట్లు దండుకునే ప్ర‌య‌త్నంలో ఉన్నాయ‌ని.. వారి మ‌ధ్య లోపాయ‌కారీ ఒప్పందం ఉంద‌ని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఇటీవ‌ల ఆరోపించారు.

ఐతే బీజేపీ, ఎంఐఎం ఎందుకు క‌లుస్తాయి.. వాటి మ‌ధ్య స్నేహం ఏంటి అని చాలామంది కొట్టిపారేశారు. రేవంత్ మాట‌ల్ని తేలిగ్గా తీసుకున్నారు. కానీ రేవంత్ ఆరోప‌ణ‌ల‌కు బ‌లం చేకూర్చే ఒక ఫొటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుండ‌టం అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేస్తోంది.

జీహెచ్ంసీ ఎన్నిక‌ల ప్ర‌చారం కూడా ఇటీవ‌లే కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ హైద‌రాబాద్‌కు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఆ సంద‌ర్భంగా ఆమెను ఎంఐఎం అధినేత అస‌దుద్దీన్ ఒవైసీ క‌లిసిన ఫొటో సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది. ఇది తాజాగా ఇద్ద‌రూ క‌లుసుకున్న‌పుడు తీసిన ఫొటోనే అని అంటున్నారు. ఇరు పార్టీలు ప‌ర‌స్ప‌రం తీవ్ర స్థాయిలో విమ‌ర్శించుకుంటూ, ఆరోప‌ణ‌లు ప్ర‌త్యారోప‌ణ‌లు చేసుకుంటున్న స‌మ‌యంలో కేంద్ర మంత్రిని ఎంఐఎం అధినేత ఎందుకు క‌ల‌వాల్సి వ‌చ్చింద‌న్న‌ది ప్ర‌శ్నార్థ‌కం.

ఇలా క‌లిసినంత మాత్రాన లోపాయ‌కారీ ఒప్పందం ఉన్న‌ట్లేమీ కాదు కానీ.. ఈ ఫొటో అయితే స‌రైన సంకేతాల‌నివ్వ‌ట్లేదు. ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్‌తో బీజేపీ ఢీ అంటే ఢీ అంటున్న నేప‌థ్యంలో హైద‌రాబాద్‌లో త‌న ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా సీఎం కేసీఆర్‌ను ప్ర‌ధాని మోడీ దూరం పెట్టిన సంగ‌తి తెలిసిందే. ఇలాంటి త‌రుణంలో మ‌ర్యాద‌పూర్వ‌కంగా కూడా ప్ర‌త్య‌ర్థులు క‌ల‌వొద్ద‌ని అంద‌రూ అనుకుంటారు. మ‌రి స్మృతిని ఒవైసీ ఎందుకు క‌లిశారో?