శర్వానంద్‍ ఫుల్లుగా క్యాష్‍ చేసుకుంటున్నాడు

అగ్ర హీరోల సినిమాలు వచ్చే ఏడాదిలో చాలా తక్కువ సంఖ్యలో రిలీజ్‍ అవుతాయి. అంటే పండుగల సీజన్లో కూడా పెద్ద సినిమాలు ఎక్కువగా వుండకపోవచ్చు. ఆచార్య, రాధేశ్యామ్‍ చిత్రాలే దసరాకు కానీ రాకపోవచ్చుననే టాక్‍ వినిపిస్తోంది. ఇక పుష్ప, సర్కారు వారి పాట చిత్రాలు 2022లోనే వచ్చేదంటూ ఊహాగానాలు సాగుతున్నాయి. వీటిలో ఒకటి రెండు సినిమాలు ముందుగా వచ్చేసినా కానీ వచ్చే ఏడాది పూర్తిగా మిడిల్‍ రేంజ్‍ సినిమాలదే హవా అవుతుంది. ఈ సంగతిని అందరికంటే ముందుగా పసిగట్టాడు శర్వానంద్‍. అందుకే ఒక సినిమా తర్వాత మరొకటి అనే తన స్టయిల్‍ని విడిచి పెట్టేసి ప్రస్తుత సిట్యువేషన్‍ని ఫుల్లుగా క్యాష్‍ చేసుకుంటున్నాడు.

ఇప్పుడు తన సినిమాలు నిర్మాణ దశలో రెండున్నాయి. మరో మూడు సినిమాలు త్వరలోనే పట్టాలెక్కుతున్నాయి. ఆమధ్య ఫ్లాప్స్ రావడంతో తన గ్రాఫ్‍ పడిపోయినా కానీ శర్వానంద్‍ అదేమీ పట్టించుకోవడం లేదు. ఈ బంచ్‍లో చేస్తోన్న సినిమాల్లో రెండు, మూడు హిట్టయినా కానీ తన మార్కెట్‍ ఎటూ పోదని భావిస్తున్నాడు. అందుకే మునుపటి కంటే పారితోషికం కాస్త తగ్గించుకుని నిర్మాతలను మరింతగా ఆకర్షిస్తున్నాడు. కాస్త పేరున్న హీరోలంతా మునుపటి కమిట్‍మెంట్లతో బిజీగా వుండడంతో శర్వానంద్‍ ఆ పరిస్థితిని తనకు అనుకూలంగా మలచుకున్నాడు.