బాలీవుడ్లో సినిమా చూపిస్తున్న హైదరాబాద్ అమ్మాయ్

తెలుగమ్మాయిలకు తెలుుగలో ఛాన్సులు రావడమే కష్టం. అలాంటిది నేరుగా బాలీవుడ్‌కు వెళ్లి అవకాశం అందుకోవడం అంటే గగనమే. శోభిత దూళిపాళ్ల మినహాయిస్తే అలా అవకాశం అందుకున్న వాళ్లు దాదాపుగా కనిపించరు. ఐతే ఇప్పుడు ఓ హైదరాబాదీ అమ్మాయి నేరుగా బాలీవుడ్లో ఒకేసారి రెండు సినిమాల్లో అవకాశం దక్కించుకుంది. ఆమె తెలుగులో కంటే ముందు హిందీలోనే కథానాయికగా అరంగేట్రం చేస్తుండటం విశేషం. తన పేరు.. అమ్రిన్ ఖురేషి. అందాల పోటీల్లో మెరిసిన ఈ అమ్మాయి.. రాజ్ కుమార్ సంతోషి లాంటి పెద్ద దర్శకుడి సినిమాతో బాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తోంది. ఆ సినిమా పేరు.. బ్యాడ్ బాయ్.

ఈ చిత్రానికి తెలుగు సినిమాతో కనెక్షన్ ఉండటం విశేషం. కొన్నేళ్ల కిందట తెలుగులో సూపర్ హిట్ అయిన రాజ్ తరుణ్ మూవీ ‘సినిమా చూపిస్త మావ’కు ఇది రీమేక్. ఇందులో ఒకప్పటి స్టార్ హీరో మిథున్ చక్రవర్తి తనయుడైన నమషి చక్రవర్తి కథానాయకుడిగా నటిస్తున్నాడు. ఒకప్పుడు అగ్ర కథానాయకులతో సినిమాలు తీసిన రాజ్ కుమార్ సంతోషి.. గత కొన్నేళ్లలో డౌన్ అయినప్పటికీ.. లెజెండరీ స్టేటస్ ఉన్న అలాంటి డైరెక్టర్ చిత్రంతో అమ్రిన్ ఖురేషి బాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వనుండటం విశేషం.

ఆమె మరో హిందీ సినిమాలో కూడా కథానాయికగా నటించబోతోంది. అది కూడా తెలుగు రీమేకే కావడం యాదృచ్ఛికం. అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్ హిట్ మూవీ ‘జులాయి’ హిందీలో ఈ రీమేక్‌లో ఎవరు హీరోగా నటించేది ఇంకా ఖరారవ్వలేదు కానీ.. కథానాయికగా మాత్రం అమ్రిన్ ఖురేషి ఫిక్సయింది. కియారా అద్వానీని గుర్తు తెచ్చేలా పర్ఫెక్ట్ లుక్‌తో ఉన్న అమ్రిన్ ఈ సినిమాలో బాలీవుడ్లో ఎలాంటి ముద్ర వేస్తుందో చూడాలి.