యువనేతలిద్దరికీ మంచి బహుమానమే దక్కబోతోందా ?

అవును ఢిల్లీ సర్కిళ్ళల్లో ఇపుడిదే అంశంపై చర్చలు జోరుగా మొదలైపోయాయి. మామూలుగా అయితే మంచి ప్రతిభ కనబరచిన వారికో లేకపోతే పనితీరుతో పార్టీని విజయతీరాలకు చేర్చినందుకో నేతలకు ప్రమోషన్ రావటం సహజం. కానీ ఇక్కడ బీజేపీ అగ్రనేతల వ్యవహార శైలి మాత్రం అందుకు భిన్నంగా ఉంది. మధ్యప్రదేశ్, బీహార్ ఎన్నికల్లో తమకు పరోక్షంగా సాయపడిన కారణంగా ఇద్దరు యువనేతలను కేంద్రమంత్రివర్గంలోకి తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్రమోడి అనుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఇంతకీ విషయం ఏమిటంటే మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చటంలో జ్యోతిరాధిత్య సింథియాది ప్రధాన పాత్ర. సింథియా కూడా కాంగ్రెస్ నేతే అయినప్పటికీ సీఎం కుర్చీ కోసం అప్పటి ముఖ్యమంత్రి కమలనాధ్ తో జరిగిన కీచులాటల్లో పార్టీ నుండి బయటకు వచ్చేశారు. వచ్చేయటం కూడా తన మద్దతుదరులైన 25 మంది ఎంఎల్ఏలను కాంగ్రెస్ నుండి బయటకు తెచ్చేయటంతో కమలనాధ్ ప్రభుత్వం కూలిపోయింది. తర్వాత జరిగిన పరిణామాల్లో మళ్ళీ ఉపఎన్నికలొచ్చాయి. తన మద్దతుదారులందరికీ టికెట్లిప్పించుకున్న సింథియా 19 మందిని గెలిపించుకున్నారు.

అంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చినందుకు, ఉపఎన్నికల్లో 19 మంది తన మద్దతుదారులను గెలిపించుకోవటం ద్వారా బీజేపీ ప్రభుత్వం పడిపోకుండా ఆదుకున్నందుకు బహుమానంగా సింథియాకు కేంద్రమంత్రి పదవి దక్కబోతోందని సమాచారం. సింథియా కాంగ్రెస్ నుండి బీజేపీలోకి రావటం వల్ల కొంత మైనస్ జరిగినా కొంత ప్లస్ కూడా జరిగిందట. బీజేపీలో చేరటం వల్ల అంతకుముదున్న మహారాజా ఇమేజి మొత్తం పడిపోయిందంటున్నారు. ఇదే సమయంలో కేంద్రంలో మంత్రిపదవిని పొందబోతున్నారట. ఏదో రకంగా బ్యాలెన్సు అవుతోందని సింథియా కూడా అనుకుంటున్నారట.

ఇక తాజాగా బీహార్ ఎన్నికలను తీసుకుంటే ఇక్కడ ఎల్జేపీ అధినేత చిరాగ్ పాశ్వాన్ కు కూడా శ్రమకు తగ్గ బహుమానమే దక్కబోతోందట. శ్రమకు తగ్గ బహుమానం అంటే ఒకే దెబ్బకు చిరాగ్ రెండు పిట్టలను కొట్టారు. ఒకే దెబ్బ కొట్టడమంటే ఎన్నికల్లో 135 నియోజకవర్గాల్లో పోటీ చేసి కేవలం ఒకే ఒక నియోజకవర్గంలో గెలవటం. రెండు పిట్టలంటే జేడీయు, మహాగట బంధన్ అభ్యర్ధుల గెలుపుకు అడ్డుపడటం అన్నమాట. సుమారు 50 నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్ధులకు వచ్చిన మెజారిటి 2 వేల ఓట్లలోపే. అదే సమయంలో పై నియోజకవర్గాల్లో జేడీయు, ఎంజీబీ అభ్యర్ధులకు పడుతుందని అనుకున్న ఓట్లను ఎల్జేపీ అభ్యర్ధలు చీల్చేశారు.

అంటే ఎల్జేపీ అభ్యర్ధులు తలా సగటున 5 వేల ఓట్లను తెచ్చుకున్నారు. ఎల్జేపీ అభ్యర్ధులు లేకపోయుంటే ఆ ఓట్లన్నీ జేడీయుకి కానీ లేకపోతే ఎంజీబీ అభ్యర్ధులకు కానీ పడేవని అంచనా. మిత్రపక్షమే అయినా జేడీయు అభ్యర్ధులు కూడా ఓడిపోవటంతో అధికార కూటమిలో ఇపుడు బీజేపీదే పై చేయయ్యింది. దీనివల్ల సిఎం నితీష్ కుమార్ పై సంపూర్ణ ఆధిక్యత సాధించింది. మరి ఇన్ని పనులు చిరాగ్ పాశ్వాన్ లేకుండా బీజేపీకి సాధించగలిగేది కాదు. అందుకనే చిరాగ్ ను కూడా కేంద్రమంత్రివర్గంలోకి తీసుకోవాలని మోడి డిసైడ్ అయ్యారట. మొత్తానికి యువనేతలకు మంచి బహుమానాలే దక్కబోతున్నాయన్న మాట.