ఆదివారం చికెన్.. మటన్.. బ్యాన్

Andhra Pradesh

కరోనా కావొచ్చు.. దాని బాబాయ్ కావొచ్చు. వేళ ఏదైనా.. సందర్భం మరేదైనా సరే. ఆదివారం వస్తే చాలు.. కాసింత చికనో.. మటనో తింటే అదో లెక్క. ఎంత లాక్ డౌన్ అయితే మాత్రం పస్తులుంటామా? కరోనా పుణ్యమా అని బయటకు వెళ్లలేని వేళ.. ఇళ్లల్లోనే బంధీలుగా మారిపోయిన దుస్థితి.

కలలో కూడా ఊహించని రీతిలో వారాలకు తరబడి ఇళ్లలోనే ఉంటున్న వారికి.. వారాంతం వస్తే చాలు.. కూసింత చికనో.. కాసింత మటనో తెచ్చుకొని వండుకుంటే తప్పించి.. ఆదివారం పూర్తి కాదు.

అయితే.. ఏపీ ప్రభుత్వం తాజాగా షాకింగ్ నిర్ణయాన్ని తీసుకుంది. ఆదివారం వేళ మటన్ అమ్మకాలపై పూర్తిస్థాయిలో నిషేధాన్ని విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. నిత్యవసర వస్తువుల్ని తెచ్చుకునేందుకు ఇళ్లల్లో నుంచి బయటకు రావటానికి వీలుగా అనుమతలు ఇస్తే.. ప్రజలు వాటిని దుర్వినియోగం చేయటాన్ని తప్పు పట్టారు.

నిత్యవసర వస్తువుల్ని తెచ్చుకోవటానికి అనుమతిస్తే.. నిబంధనలకు విరుద్ధంగా బయటకు వస్తున్నారని.. ఆదివారం వేళ.. మాంసం దుకాణాల వద్ద నెలకొన్న రద్దీని చూస్తే.. పరిస్థితి ఇట్టే అర్థమైపోతుందన్నారు.

చికెన్.. మటన్.. చేపల కోసం అంగుళం దూరం కూడా పాటించకుండా షాపుల వద్ద ఎగబడిపోతున్న వైనాన్ని ఏపీ మంత్రి పేర్ని నాని తప్పుపట్టారు. ఈ కారణంతోనే ఆదివారం చికెన్.. మటన్.. చేపల అమ్మకాలపై బ్యాన్ విధించినట్లుగా తేల్చేశారు.

నాన్ వెజ్ తినకపోతే ఏమీ కాదని.. కానీ భౌతికదూరాన్ని అమలు చేయకుండా ఎగబడితే జరిగే ప్రమాదం ఎక్కువన్నారు. ఈ కారణంతోనే ఆదివారం మాంసం అమ్మకాలపై నిషేధాన్ని విధిస్తున్నట్లుగా పేర్ని స్పష్టం చేశారు. నాన్ వెజ్ ప్రియులకు ఏపీ సర్కారు తీసుకున్న తాజా నిర్ణయం వేదనకు గురి చేయటం ఖయమని చెప్పక తప్పదు.