కాంగ్రెస్ ఇప్పుడే క‌ళ్లు తెరిచిందా? వ్యూహం ఏంటి?

రాష్ట్ర విభ‌జ‌న‌తో ప్ర‌జా విశ్వాసాన్ని సంపూర్ణంగా కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ.. పుంజుకునే ప్ర‌య‌త్నాల‌ను.. ఇప్ప‌డిప్పుడే మొద‌లు పెట్టిందా? మ‌రీ ముఖ్యంగా రాజ‌ధాని అమ‌రావ‌తి విష‌యంలో ఆ పార్టీ దొంగ‌లు ప‌డ్డ ఆర్నెల్ల త‌ర్వాత‌.. అన్న‌చందంగా కార్యాచ‌ర‌ణ ప్రారంభించిందా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. తాజాగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో అమ‌రావ‌తి ప‌రిర‌క్ష‌ణ స‌మితి క‌మిటీ అనే కొత్త విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఇది ఇక నుంచి అమ‌రావ‌తిపై పోరు స‌ల్పుతుంద‌ని.. నాయ‌కులు ప్ర‌క‌టించారు. ఈ క్ర‌మంలోనే ఈ నెల 20న రాజ‌ధాని కోసం శంకుస్థాప‌న జ‌రిగిన ఉద్ధండ రాయుని పాలెంలో భారీ బ‌హిరంగ స‌భ‌ను ఏర్పాటు చేస్తున్నారు.

వాస్త‌వానికి అమ‌రావ‌తి ఉద్య‌మం ప్రారంభ‌మై.. 340 వ రోజుకు చేరుకుంటోంది. ఇన్నాళ్ల‌లో కాంగ్రెస్ ఎప్పుడూ రోడ్డు మీద‌కు రాలేదు. అడ‌పా ద‌డ‌పా.. మాత్ర‌మే అమ‌రావ‌తికి తాము అనుకూలం అంటూ.. ప్ర‌క‌ట‌నలు గుప్పించిందే త‌ప్ప‌.. రైతుల‌నుఅ రెస్టు చేసినా.. పోలీసులు లాఠీల‌తో రైతుల‌ను కుళ్ల‌బొడి చినా.. తీవ్ర వివాదాలు రేగినా.. రాజ‌ధాని ప్రాంతానికి కాంగ్రెస్ నేత‌లు వ‌చ్చింది లేదు. ఒకే ఒక్క నాయకులు సుంక‌ర ప‌ద్మ‌శ్రీ ఇక్క‌డ ప‌ర్య‌టిస్తున్నారు. అది కూడా ఆమె వ్య‌క్తిగత హోదాలోనే వ‌స్తున్నార‌నే విష‌యం అంద‌రికీ తెలిసిందే. కానీ.. ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ నాయ‌కులు హ‌ఠాత్తుగా క‌ళ్లు తెరిచారు. రాజ‌ధాని ఉద్య‌మం ఇప్పుడే ప్రారంభ‌మైన‌ట్టు చెబుతున్నారు.

మ‌రి ఇప్పుడు ఇలా.. కాంగ్రెస్ క‌ళ్లు తెర‌వ‌డం వెనుక వ్యూహం ఏంటి? అంటే.. కేవ‌లం తిరుప‌తి ఉప ఎన్ని కేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో క‌నీస ఓటు షేర్‌ను కూడా సాధించ‌లేని ప‌రిస్థితిలో కునారిల్లిన కాంగ్రెస్‌కు ప‌గ్గాలు చేప‌ట్టిన సాకే శైల‌జానాథ్‌కు ఇప్పుడు ఈ ఉప పోరు ప్ర‌తిష్టాత్మకంగా మారింది. ఆయ‌న ప‌గ్గాలు చేప‌ట్టిన త‌ర్వాత జ‌రుగుతున్న కీల‌క‌మైన ఎన్నిక కూడా ఇదే. త‌న‌ను తాను నిరూపించుకునేందుకు, పైగా తాను కూడా సీమ ప్రాంతానికే చెందిన నాయ‌కుడు కావ‌డంతో ఈ ఎన్నిక‌ను ప్ర‌తిష్టాత్మకంగా తీసుకున్న ఆయ‌న ఇక్క‌డ గెలిచి తీరాల‌నే సంక‌ల్పంతో ముందుకు సాగుతున్నార‌ని అంటున్నారు కాంగ్రెస్ నేత‌లు.

కానీ, దీనికి ప‌రిస్థితులు అనుకూలంగా లేవ‌నేది క్షేత్ర‌స్థాయిలో ప‌రిస్థితుల‌ను గ‌మ‌నిస్తే అర్ధ‌మ‌వుతోంద‌ని చెబుతున్నారు ప‌రిశీల‌కులు. ఎక్క‌డిక‌క్క‌డ క‌కావిక‌ల‌మైన కాంగ్రెస్ శ్రేణులు.. పైగా కాంగ్రెస్‌కే చెందిన మాజీ నాయ‌కులు ప‌న‌బాక ల‌క్ష్మి.. టీడీపీ త‌ర‌ఫున మ‌రోసారి బ‌రిలో దిగుతుండ‌డం, ప్ర‌జ‌ల్లో సానుభూతి లేక‌పోవ‌డం.. స‌రైన నాయ‌క‌త్వం లోపించ‌డం వంటివి ఆ పార్టీ శాపాలుగా మారాయి. అదేస‌మ‌యంలో ప‌క్కావ్యూహం కూడా లేక‌పోవ‌డం మ‌రింతగా కాంగ్రెస్‌ను ఇబ్బంది పెడుతున్న ప‌రిణామాలు. ఏదేమైనా..కాంగ్రెస్ ఇప్పుడు వేసిన వ్యూహం కూడా బాగోలేద‌నే టాక్ వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.