సుగుణ‌మ్మ రాజ‌కీయాలు ముగిసిన‌ట్టేనా? బాబు వ్యూహం ఏంటి?

టీడీపీ అధినేత చంద్ర‌బాబు సొంత జిల్లా చిత్తూరులో కీల‌క‌మైన తిరుప‌తి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలో కీల‌క మార్పుల దిశ‌గా చంద్ర‌బాబు వ్యూహాత్మ‌క అడుగులు వేస్తున్నారు. ఇక్క‌డ నుంచి పార్టీలో కీల‌కంగా ఉన్న మాజీ ఎమ్మెల్యే సుగుణ‌మ్మ‌కు చెక్ పెట్టేలా చంద్ర‌బాబు వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని అంటున్నారు సుగుణ‌మ్మ మ‌ద్ద‌తు దారులు. దీంతో ఈ నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ ప‌రిస్థితి చ‌ర్చ‌నీయాంశంగా మారింది. పార్టీ స్థాపించిన ద‌గ్గ‌ర నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ఈ నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ కేవ‌లం 4 సార్లు మాత్రమే గెలుపు గుర్రం ఎక్కింది. పార్టీ పెట్టిన సంవ‌త్స‌రంలో ఇక్క‌డ నుంచి ఎన్టీఆర్ పోటీ చేసివిజ‌యం సాధించారు.

ఆత‌ర్వాత 1994, 1999లో వ‌రుస విజ‌యాల‌ను టీడీపీ ద‌క్కించుకుంది. ఇక‌, ఆ త‌ర్వాత వైఎస్ హ‌వా ప్రారంభ మైంది. దీంతో పార్టీ వ‌రుస ఓట‌ములతో కుదేలైంది. ఈ క్ర‌మంలో పార్టీని బ‌లోపేతం చేసేందుకు ఎం. వెంక‌ట‌ర‌మ‌ణ ఎంతో కృషి చేశారు. గ‌తంలో కాంగ్రెస్‌లో ఉన్న వెంక‌ట ర‌మ‌ణ‌.. భూమన క‌రుణాక‌ర్‌రెడ్డి రాక‌తో.. అలిగి.. పార్టీ మారి సైకిల్ ఎక్కారు. ఈ క్ర‌మంలో కాంగ్రెస్ ఓటు బ్యాంకు చీలిపోయి.. వెంక‌ట‌ర‌మ‌ణకు అనుకూలంగా మారింది. ఈ క్ర‌మంలోనే ఆయ‌న 2014లో విజ‌యం సాదించారు. అయితే, ఈ విజ‌యాన్ని ఆస్వాదించేలోగా.. హ‌ఠాన్మ‌ర‌ణం చెందారు. దీంతో ఇక్క‌డ జ‌రిగిన ఉప పోరులో వెంక‌ట‌ర‌మ‌ణ స‌తీమ‌ణి సుగుణ‌మ్మ‌కు చంద్ర‌బాబు టికెట్ ఇచ్చారు.

ఈ క్ర‌మంలో 2015లో జ‌రిగిన ఉప పోరులో సుగుణ‌మ్మ ఏక‌ప‌క్షంగా విజ‌యం ద‌క్కించుకున్నారు. టీటీడీ బోర్డు స‌భ్యురాలుగా కూడా చంద్ర‌బాబు ఆమెకు అవ‌కాశం ఇచ్చారు. అయితే, సుగుణ‌మ్మ త‌న భ‌ర్త మాదిరిగా దూకుడు ప్ర‌ద‌ర్శించలేక పోవ‌డం, అందరినీ కలుపుకొని పోవ‌డంలో విఫ‌ల‌మ‌య్యారు. ఈ ప‌రిణామాలు వైసీపీకి క‌లిసి వ‌చ్చాయి. దీంతో భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి గ‌త ఎన్నిక‌ల్లో భారీ విజ‌యం న‌మోదు చేశారు. ఇక‌, వ‌చ్చే ఎన్నిక‌ల నాటికైనా పార్టీని బ‌లోపేతం చేసుకోవాల‌ని అనుకున్నారో.. ఏమో.. చంద్ర‌బాబు.. ఇప్పుడు సుగుణ‌మ్మ‌ను ప‌క్క‌న పెట్టారు. పార్టీలో ఆమెకు ప్రాధాన్యం లేకుండా పోయింద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.

ఇటీవ‌ల పార్టీ ప‌ద‌వుల విష‌యంలో మాజీ ఎమ్మెల్యేగా సుగుణ‌మ్మ కొంద‌రి పేర్ల‌ను సిఫార‌సు చేశారు. అయితే, చంద్ర‌బాబు వారికి ప‌దవులు ఇవ్వ‌క‌పోగా.. క‌నీసం ప్రాధాన్యంలోకి కూడా తీసుకోలేదు. పైగా వీరి వ్య‌తిరేక వ‌ర్గంగా ఉన్న జయరామిరెడ్డి భార్య రజనీ, వినుకొండ సుబ్రమణ్యం, సిపాయి సుబ్రమణ్యం, సూరా సుధాకర్‌రెడ్డికి పదవులుఇచ్చారు. ఈ ప‌రిణామంపై సుగుణ‌మ్మ వ‌ర్గం తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. పార్టీకి తాము ఇక దూరం కావాల్సిందే..! అనే వ్యాఖ్య‌లు చేయ‌డం గ‌మ‌నార్హం. మొత్తానికి చంద్ర‌బాబు వ్యూహం బాగానే ఉన్నా.. ఆయ‌న ఎంచుకున్న వారైనా.. పార్టీని బ‌లోపేతం చేస్తారా? లేదా? అనేది ఆస‌క్తిగా మారింది.