‘బ్యాంకు ఫ్రాడు’చౌదరిను ఎయిర్ పోర్టులో అడ్డుకున్నారు

కేంద్రమాజీ మంత్రి సుజనా చౌదరి ఢిల్లీ ఎయిర్ పోర్టులో అవమానం జరిగింది. అమెరికాకు వెళ్ళేందుకు విమానాశ్రయానికి వచ్చిన సుజనాను ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు. అనేక బ్యాంకు ఫ్రాడు కేసుల విచారణను ఎదుర్కొంటున్న మాజీ కేంద్రమంత్రిపై లుకవుట్ నోటీసు ఉన్న కారణంగా దేశం విడిచి వెళ్ళే అవకాశాలు లేవని అడ్డుకున్నారు. దాంతో అత్యతవసరంగా లంచ్ మోషన్ పద్దతిలో కోర్టులో పిటీషన్ వేసిన సుజనా చివరకు అమెరికాకు వెళ్ళటానికి రెండు వారాల అనుమతిని తెచ్చుకున్నారు.

ఇంతకీ ఏమి జరిగిందంటే అనేక బ్యాంకుల్లో అప్పులు తీసుకుని సుమారు రూ. 8 వేల కోట్లను ఎగొట్టిన అభియోగాలను సుజనా ఎదుర్కొంటున్నారు. అప్పులు ఎగొట్టిన విషయంలో బ్యాంకులు కేసులు కూడా పెట్టాయి. మారిషస్ బ్యాంకు నుండి తీసుకున్న రూ. 100 కోట్లను ఎగొట్టిన కేసులో కేంద్రమంత్రిగా ఉన్నపుడే నాంపల్లి కోర్టు అరెస్టు వారెంటు కూడా జారీ చేసిన విషయం అందరికీ తెలిసిందే. బ్యాంకు ఫ్రాడ్ కేసుల్లో సుజనాపై 2018లోనే సీబీఐ మూడు ఎఫ్ఐఆర్ లు నమోదు చేసింది.

సుజనా బ్యాంకులను మోసం చేశారని, డొల్ల కంపెనీలు పెట్టి మనీ ల్యాండరింగ్ కు పాల్పడ్డారనే అనేక అభియోగాల మీద ఎన్ఫోర్స్ మెంటు డైరెక్టరేట్, ఇన్ కమ్ ట్యాక్స్ కూడా సుజనాపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాయి. సుజనా ఆస్తులను ఎటాచ్ చేసుకోవటమే కాకుండా వేలం వేస్తున్నట్లు గతంలో బ్యాంకులు బహిరంగ నోటీసులు కూడా జారీ చేశాయి. ఇన్ని కేసులను ఎదుర్కొంటున్న సుజనాపై సీబీఐ 2018లోనే లుకవుట్ నోటీసు జారీ చేసింది. అంటే దీని ప్రకారం భారత్ ను విడిచి ఏ దేశానికి కూడా సుజనా వెళ్ళేందుకు లేదు.

ఇక్కడ గమనించాల్సిదేమంటే తనపై లుకవుట్ నోటీసు జారీ చేసిన విషయం సుజనాకు బాగా తెలుసు. తెలిసి కూడా ఈ కేంద్రమంత్రి ముందస్తు అనుమతులు తీసుకోకుండా అమెరికాకు వెళ్ళేందుకు ప్రయత్నించటమే ఆశ్చర్యంగా ఉంది. ఎప్పుడైతే తనను ఎయిర్ పోర్టులో ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డగించారో అప్పటికప్పుడు కోర్టును ఆశ్రయించి అనుమతి తెచ్చుకున్నారు. సుజనా ఎంపి హోదాలో ఉన్నారు కాబట్టే రెండు వారాల పాటు అమెరికాలో పర్యటించేందుకు అనుమతిస్తున్నట్లు కోర్టు స్పష్టంగా చెప్పింది.

అయితే అమెరికా నుండి తిరిగి వచ్చిన వెంటనే ఇమ్మిగ్రేషన్ అధికారులకు సమాచారం ఇవ్వాలని కూడా కోర్టు ఆదేశించింది. అలాగే తనపై జారీ అయిన లుకవుట్ నోటీసును రద్దు చేయాలన్న సుజనా కోరికను కోర్టు తోసిపుచ్చింది. లుకవుట్ నోటీసు రద్దు చేయటంతో తనకు సంబంధం లేదని తేల్చి చెప్పేసింది.