ఐతే పవన్‌తో అతను చేస్తున్నట్లే..

ఈ ఏడాది ఆరంభంలో మలయాళంలో బ్లాక్‌బస్టర్ అయిన ‘అయ్యప్పనుం కోషీయుం’ సినిమా రీమేక్ హక్కులను.. సినిమా విడుదలైన కొన్ని రోజులకే సొంతం చేసుకుంది సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ. ఇక అప్పట్నుంచి లీడ్ రోల్స్ కోసం సాగిన వేట ఎంతకీ తెగలేదు. ముందు ప్రధాన పాత్రలకు ప్రచారం జరిగిన పేర్లు వేరు. చివరికేమో ఎవరూ ఊహించని విధంగా పవన్ కళ్యాణ్ లైన్లోకి వచ్చాడు. ఒరిజినల్లో బిజు మీనన్ చేసిన పోలీస్ పాత్రను పవన్ చేయబోతున్నట్లు వెల్లడైంది. మరి పృథ్వీరాజ్ చేసిన ఎక్స్ సర్వీస్ మ్యాన్ పాత్ర ఎవరిది అనే ఉత్కంఠ కొనసాగుతోంది.

నిజానికి పవన్ పేరు పరిగణనలోనే లేనపుడు పృథ్వీరాజ్ పాత్రకు రానా ఓకే అయినట్లు కొన్ని నెలల కిందటే వార్తలొచ్చాయి. ఇంకో పాత్ర విషయంలోనే సస్పెన్స్ అంతా అన్నారు. తీరా చూస్తే అవతలి పాత్రకు పవన్ ఓకే అయ్యాడు. మరో పాత్ర విషయంలో సస్పెన్స్ నడుస్తోంది.

రానాతో పాటుగా సాయిధరమ్ తేజ్, నితిన్, సుదీప్.. ఇలా రకరకాల పేర్లు తెరపైకి వచ్చాయి. కానీ ఎక్కువమంది చూపు రానా వైపే ఉంది. ఇదే విషయమై తాజాగా ఓ ఇంటర్వ్యూలో రానాను అడిగితే.. అతను ఆసక్తికర రీతిలో స్పందించాడు. ఈ సినిమాలో ఒక పాత్ర కోసం తనను నిర్మాతలు సంప్రదించిన వాస్తమే అన్నాడతను. ఐతే తాను ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని, ఏమీ ఫైనలైజ్ కాలేదని.. సరైన సమయంలో దీనిపై నిర్ణయం వెలువడుతుందని, అంత దాకా ఎదురు చూడాలని అన్నాడు. అతడి మాటల్ని బట్టి చూస్తే రానాకు ఈ పాత్రకు కంటెండరే అనే విషయం స్పష్టమవుతోంది.

మరి పవన్‌తో నటించే అవకాశం వస్తే రానా ఇంకా ఆలోచిస్తున్నాడా.. లేక అతణ్ని ఓకే చేసే విషయంలో దర్శక నిర్మాతలు ఆలోచిస్తున్నారా అన్నది తెలియడం లేదు. ఈ పాత్ర ఓకే అయితే సాధ్యమైనంత త్వరగా షూటింగ్ మొదలుపెట్టేయాలన్నది చిత్ర బృందం ప్లాన్.