రోడ్డెక్కిన రాజుల వివాదం

విజయనగరంలో పూసపాటి రాజుల వివాదం రోడ్డెక్కింది. ఇంతకాలం కోర్టుల్లోను, ట్విట్టర్ వేదికలకు మాత్రమే పరిమితమైన అశోక్ గజపతిరాజు-సంచైత గజపతి రాజు వివాదం చివరకు రోడ్డున పడింది. ‘సేవ్ మాన్సాస్ ట్రస్ట్’ పేరుతో అశోక్ సంచైతకు వ్యతిరేకంగా రోడ్డుపై ఆందోళనలు మొదలుపెట్టారు. మాన్సాస్ ట్రస్టు ఛైర్ పర్సన్ గా సంచైత బాధ్యతలు తీసుకున్న తర్వాత ట్రస్టు ప్రిస్టేజ్ అంతా రోడ్డుపాలైనట్లు అశోక్ చాలా ఘాటైన వ్యాఖ్యలు చేస్తున్నారు. అంతేకాకుండా సంచైతపై కోర్టులో కేసు కూడా వేశారు. ఇది చాలదన్నట్లుగా అవకాశం దొరికినప్పుడల్లా ట్విట్టర్లో తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. సంచయిత పై సందర్భోచితంగా చంద్రబాబునాయుడు, లోకేష్ తో కూడా ఆరోపణలు చేస్తున్నారు.

సరే ఎంతైనా పూసపాటి గజపతుల వారసత్వమే కాబట్టి సంచైత కూడా ట్విట్టర్ తో పాటు ప్రెస్ మీట్లు పెట్టి మాటకు మాట అప్పచెప్పేస్తోంది. చంద్రబాబు, లోకేష్ మీద రెచ్చిపోయి ట్విట్లర్లోనే సమాధానం చెప్పేస్తోంది. ఈ గొడవలు ఇలా ఉండగానే తాజాగా అశోక్ సేవ్ మాన్సాస్ అంటూ ఆందోళన పేరుతో రోడ్డుపైకి వచ్చారు. దాంతో సంచైత ట్విట్టర్ వేదికగా బాబాయ్ పై చెలరేగిపోయారు.

సేవ్ మాన్సాస్ అనేందుకు తానేమీ ట్రస్టు వ్యవహారాలను బజారుకు ఈడ్వలేదంటు చాలా గట్టిగా రిప్లై ఇచ్చారు. అసలు ట్రస్టు వ్యవహారాలు వివాదాస్పదమైంది, ట్రస్టు నష్టపోయింది బాబాయ్ అశోక్ హయాంలోనే అంటు రెచ్చిపోయారు. బాబాయ్ ట్రస్టు ఛైర్మన్ గా ఉన్నపుడే సేవ్ మాన్సాస్ అంటు ఆందోళనలు చేసుండాల్సందంటు కొన్ని విషయాలను గుర్తుచేశారు. సేవ్ మాన్సాస్ ట్రస్టు పేరుతో మొదలుపెట్టిన క్యాంపైన్ ఉద్దేశ్యం నిజానికి సేవ్ అశోక్ అనే అంటు ఎద్దేవా చేశారు. తాను ఛైర్మన్ గా ఉన్నపుడు ట్రస్టులో జరిగిన అవకతవకలు, అక్రమాలు, అవినీతి మొత్తం ఇపుడు ఒక్కోటిగా బయటపడుతుంటే అశోక్ లో టెన్షన్ మొదలైందంటు మండిపోయారు.

150 ఏళ్ళ చరిత్రున్న మోతీమహల్ నేల మట్టమైనపుడు సేవ్ మాన్సాస్ అంటు అశోక్ ఎందుకు ఆందోళన చేయలేదన్నారు. 2016-20 మధ్య కాలంటో ప్రభుత్వానికి సరైన సమాచారం ఇవ్వని కారణంగానే విద్యా సంస్ధలకు రావాల్సిన రూ. 6 కోట్లు రాకుండా పోయిందన్నారు. ఉన్నత విద్యామండలి నుండి సరైన అనుమతులు తెచ్చుకోని కారణంగా 170 మంది విద్యార్ధుల బీకామ్ డిగ్రాలు చెల్లుబాటు కాకుండా పోవటానికి అశోక్ చేతకానితనమే కారణమంటూ మండిపడ్డారు. మొత్తానికి ఇంత కాలానికి రాజుల మధ్య వివాదం రోడ్డున పడింది. మరి ఇంకెతదూరం వెళుతుందో చూడాల్సిందే.