ట్విట్ట‌ర్లో అన్‌ఫాలో… అస‌లు విష‌యం చెప్పిన అమెరికా

భారత ప్రధాని నరేంద్రమోదీని తన ట్విట్టర్ ఖాతా నుంచి వైట్ హౌస్‌‌ అన్‌ఫాలో చేయడం సంచలనమైంది. అగ్ర‌రాజ్యం అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌తోపాటు అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్.. మోదీని తన ట్విట్టర్ ఖాతా నుంచి అన్‌ఫాలో చేశారు. దీనిపై పెద్ద దుమార‌మే రేగింది. అమెరికా, ఇండియా మధ్య రిలేషన్‌ దెబ్బతినిందని, అందుకే ఇలా జరిగిందని చర్చలు జరుగుతున్న నేపథ్యంలో వైట్‌హౌస్‌ వివరణ ఇచ్చింది. తాము కొద్దిరోజుల పాటే, ప్ర‌త్యేక కార‌ణాల వ‌ల్లే.. ట్విట్ట‌ర్లో అకౌంట్లు ఫాలో అవుతామ‌ని తెలిపింది.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఈ ఏడాది ఫిబ్రవరి చివరి వారంలో మన దేశ టూర్‌‌కు వచ్చారు. ఈ నేపథ్యంలో వైట్‌ హౌస్‌ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని నరేంద్ర మోడీ, పీఎంవో, అమెరికాలోని మన దౌత్యకార్యాలయం, మన దేశంలోని అమెరికా దౌత్య కార్యాలయం, మన దేశంలోన అమెరికా రాయబారి ట్విట్టర్‌‌ అకౌంట్లను ఫాలో అయింది. ఈ మధ్య ఆ ఆరు ఖాతాలను అన్‌ఫాలో చేసింది. దీంతో పెద్ద దుమార‌మే రేగింది. ట్విట్టర్‌‌ ఖాతాలను వైట్‌హౌస్‌ అన్‌ఫాలో చేసిన విషయంపై క్లారిటీ ఇచ్చింది.

అమెరికా అధ్యక్షుని పర్యటన సందర్భంగా ట్విట్టర్‌‌ అకౌంట్లను ఫాలో అవుతామని, ఆ తర్వాత కొన్ని రోజులకు అన్‌ఫాలో చేస్తామని వైట్‌హౌస్‌లోని అధికారులు వివరణ ఇచ్చారు. పర్యటనకు మద్దతుగా.. వారి ట్వీట్స్‌ను రీ ట్వీట్‌ చేసేందుక కొద్ది కాలం పాటు మాత్రమే అకౌంట్లను ఫాలో అవుతున్నట్లు చెప్పారు. “ వైట్‌హౌస్‌ కేవలం అమెరికాలోని సీనియర్‌‌ ప్రభుత్వ అధికారుల ట్విట్టర్‌‌ను మాత్రమే ఫాలో అవుతుంది. అధ్యక్షుడి విదేశీ పర్యటన సమయంలో మాత్రం ఆతిథ్య దేశానికి సంబంధించిన అకౌంట్‌లను కొన్ని రోజులు ఫాలో అవుతుంది” అని అధికారి చెప్పారు. కాగా, ఇప్పుడు వైట్‌హౌస్‌ ట్విట్టర్‌‌లో అనుసరిస్తున్న అకౌంట్లు 13 మాత్ర‌మే.