టాలీవుడ్ దిగ్గజాలకు భూములు ఎంతెంతకు కొన్నారు?


హైదరాబాద్ శివార్లలో ఎటు వైపు చూసినా ఎకరం భూమి కోట్లల్లోనే ఉంటుంది. ఐతే సినీ దర్శకుడు శంకర్‌కు తెలంగాణ ప్రభుత్వం ఎకరా రూ.5 లక్షల చొప్పున మోకిల్ల ప్రాంతంలో 5 ఎకరాల భూమి కేటాయించడం మీద అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దీన్ని సవాలు చేస్తూ కరీంనగర్‌కు చెందిన శంకర్ అనే వ్యక్తి కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేశాడు. దీనిపై కోర్టులో విచారణ జరుగుతుండగా.. ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. ఈ సందర్భంగా ఇంతకుముందు సినీ ప్రముఖులు స్టూడియోలు నిర్మిస్తామంటే ఎంత ధరకు భూములు కేటాయించింది ఇందులో వెల్లడించారు.

ప్రభుత్వ అఫిడవిట్ ప్రకారం అక్కినేని నాగేశ్వర్‌రావుకు అప్పటి ప్రభుత్వం అన్నపూర్ణ స్టూడియో నిర్మాణం కోసం 1975లో రూ.5 వేల చొప్పున 22 ఎకరాలను కేటాయించింది. పద్మాలయ స్టూడియో కోసం 1983లో రూ.8,500 చొప్పున 9.5 ఎకరాలను కేటాయించింది. 1984లో రామానాయుడు స్టూడియో కోసం నామమాత్రపు ధరకే అప్పటి ప్రభుత్వం 5 ఎకరాలను కేటాయించింది. 1984లో దర్శకుడు రాఘవేంద్రరావు, చక్రవర్తి, కృష్ణమోహ‌న్‌‌కు రూ.8,500 ప్రకారం అర ఎకరం చొప్పున కేటాయించారు.

ఇక శంకర్ విషయానికి వస్తే ఆయనకు సినీ పరిశ్రమలో 36 ఏళ్ల అనుభవం ఉందని, రూ.50 కోట్లతో ప్రపంచ స్థాయి స్టూడియో నిర్మిస్తానని.. తనకు రాయితీ మీద భూమి కేటాయించాలని 2016లో దరఖాస్తు చేసుకున్నారని, తెలంగాణకు చెందిన స్థానిక ప్రతిభావంతులను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్ ఆయనకు భూమి కేటాయించాలని‌ సిఫార్సు చేసిందని అఫిడవిట్లో పేర్కొన్నారు.

శంకర్‌కు నార్సింగి, శంకర్‌పల్లి రహదారి నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో ఎటువంటి అభివృద్ధి చేయని భూమినే కేటాయించాం. అక్కడ మార్కెట్‌ విలువ ఎకరా రూ.20 లక్షలని.. సినీ పరిశ్రమ అభివృద్ధి, ఉద్యోగ కల్పన చేయాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం రూ.5 లక్షల చొప్పున 5 ఎకరాలను కేటాయించిందని, ఇందుకోసం శంకర్‌ రూ.4.4 కోట్లు డిపాజిట్‌ కూడా చేశారని పేర్కొన్నారు. మరి వ్యాజ్యంపై కోర్టు ఏం నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.