స్టార్ హీరో దర్శకత్వంలో అమితాబ్ బచ్చన్

బాలీవుడ్లో ఒక సెన్సేషనల్ కాంబినేషన్‌కు తెర లేచింది. అమితాబ్ బచ్చన్ ఒక సీనియర్ హీరో దర్శకత్వంలో నటించబోతున్నాడు. ఆ హీరో అజయ్ దేవగణ్ కావడం విశేషం. అమితాబ్, అజయ్ దేవగణ్ కలిసి ఒక సినిమాలో నటించడం కొత్తేమీ కాదు.

మేజర్ సాబ్, హమ్ కిసీసే కమ్ నహీ, సత్యాగ్రహ లాంటి మల్టీస్టారర్లలో నటించారు. కానీ ఈసారి అమితాబ్‌తో కలిసి తెరను పంచుకోవడమే కాదు.. ఈ చిత్రాన్ని తనే డైరెక్ట్ చేస్తూ, ప్రొడక్షన్ బాధ్యత కూడా నెత్తికెత్తుకున్నాడు అజయ్. ‘మే డే’ పేరుతో ఈ సినిమా తెరకెక్కనుంది. ఇదొక ఎడ్జ్ ఆఫ్ ద సీట్ హ్యూమన్ డ్రామా అని చెబుతున్నాడు అజయ్. ఇందులో అజయ్ పైలట్ పాత్రలో కనిపించనున్నాడట. అమితాబ్ పాత్ర గురించి ఏమీ చెప్పలేదు. మరికొందరు పేరున్న ఆర్టిస్టులు ఇందులో నటిస్తారట. డిసెంబర్లో చిత్రీకరణ మొదలు కానుంది.

అజయ్‌కి దర్శకత్వం కూడా కొత్తేమీ కాదు. అతను ఇంతకుముందు తనే ప్రధాన పాత్రలో ‘శివాయ్’ అనే సినిమా తీశాడు. అందులో ‘అఖిల్’ భామ షాయేషా సైగల్ కథానాయికగా నటించింది. ఆ అడ్వెంచరస్ యాక్షన్ మూవీ బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అయింది. అయినా సరే.. అజయ్ మెగా ఫోన్ పక్కన పెట్టలేదు. ఏకంగా అమితాబ్ బచ్చన్‌ను ఒప్పించి సినిమా తీయడానికి రెడీ అయ్యడు. అమితాబ్ తన దగ్గరికి వచ్చే పది కథల్లో ఒకటో రెండో మాత్రమే ఎంచుకుంటాడు.

వయసు పెరుగుతున్నా ఆయనకు డిమాండేమీ తగ్గలేదు. ఇప్పటికీ గొప్ప గొప్ప పాత్రలు వెతుక్కుంటూ వస్తున్నాయి. మన ప్రభాస్.. ‘మహానటి’ దర్శకుడు నాగ్ అశ్విన్‌తో చేయబోయే సినిమాలోనూ అమితాబ్ ఓ కీలక పాత్ర చేయనున్న సంగతి తెలిసిందే. మూణ్నెల్ల కిందట కరోనా బారిన పడ్డ అమితాబ్.. కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతుడైన సంగతి తెలిసిందే.