టీడీపీలో ఉండ‌లేక‌.. బ‌య‌ట‌కు రాలేక‌!

మారుతున్న కాలానికి అనుగుణంగా మార్పులు చేసుకోవాల్సిన అవ‌స‌రం ఏ రంగానికైనా ఉంటుంది. ఎక్క‌డ త‌ప్పులు జ‌రుగుతున్నాయో.. వాటిని విశ్లేషించుకుని ముందుకు సాగితేనే ఎవ‌రికైనా ఫ్యూచ‌ర్ ఉంటుంద‌నేది వాస్త‌వం. కానీ, ఇది మ‌రిచిపోయిన గుంటూరు జిల్లాకు చెందిన సీనియ‌ర్ రాజ‌కీయ నేత‌.. టీడీపీ మాజీ ఎంపీ.. కురువృద్ధుడు రాయ‌పాటి సాంబ‌శివ‌రావు.. వేసిన అడుగులు ఇప్పుడు ఆ కుటుంబాన్ని రాజ‌కీయంగా ప్ర‌శ్నార్థ‌కం చేస్తున్నాయి. వ‌చ్చిన అవ‌కాశాన్ని విస్మ‌రించ‌డం.. భ‌విష్య‌త్తును అంచ‌నా వేసుకోలేక పోవ‌డం .. రాయ‌పాటి కుటుంబం చేసిన ప్ర‌ధాన పొర‌పాటుగా ఆ కుటుంబానికి స‌న్నిహితులుగా ఉన్న‌వారే చెప్పుకొస్తున్నారు.

కాంగ్రెస్‌తో ప్రారంభ‌మైన రాయ‌పాటి రాజ‌కీయం.. 2014 కు ముందు వ‌ర‌కు కూడా కాంగ్రెస్‌తోనే సాగింది. అయితే, రాష్ట్ర విభ‌జ‌న‌తో కాంగ్రెస్‌తో విభేదించిన ఆయ‌న‌.. వైసీపీ ఇచ్చిన ఆఫ‌ర్‌ను ప‌క్క‌కు పెట్టారు. ఆ స‌మ‌యంలో రాయ‌పాటి కుమారుడు .. రంగారావుకు టికెట్ ఇస్తామంటూ.. అవ‌కాశం ఉంటే.. తండ్రీ కుమారుల‌కు కూడా ఛాన్స్ ఇస్తామ‌ని.. పార్టీలోకి రావాల‌నిఆహ్వానాలు పంపారు. కానీ, నాడు.. ఆయ‌న టీడీపీలోకి చేరారు. న‌ర‌సారావుపేట ఎంపీ స్థానాన్ని కైవ‌సం చేసుకుని విజ‌యం సాధించారు. ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నా.. క‌మ్మ‌ సామాజిక వ‌ర్గం ఎక్కువ‌గా ఉన్న టీడీపీలో రాయ‌పాటి కుమారుడికి మాత్రం ఫ్యూచ‌ర్ లేకుండా పోయింది.

ఈ విష‌యంలో చంద్ర‌బాబు వ‌ర్సెస్ రాయ‌పాటి మ‌ధ్య చాలా వివాద‌మే న‌డిచింది. ఒకానొక ద‌శ‌లో గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో రాయ‌పాటి కుటుంబానికి టికెట్ కూడా లేద‌నే సంకేతాలు వ‌చ్చేశాయి. ఆ స‌మ‌యంలోనూ వైసీపీ నుంచి ఆహ్వానాలు అందాయి. కానీ, ప‌ట్టుబ‌ట్టి.. మ‌ళ్లీ టీడీపీ నుంచి టికెట్ తెచ్చుకున్నారు రాయ‌పాటి. కానీ, వృద్ధుడు.. ఒక‌రి సాయం ఉంటేనేకానీ న‌డ‌వ‌లేని స్థితిలో ఉండ‌డం.. 2014లో ఇచ్చిన హామీలు నెర‌వేర్చ‌క‌పోవ‌డం.. వంటివి న‌ర‌సారావుపేట‌లో ప‌రాజ‌యానికి కార‌ణ‌మ‌య్యాయి. ఇక‌, ఇప్పుడు త‌న కుమారుడు రంగారావును బ‌రిలో నిలిపేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు.

అయితే, టీడీపీ ఇప్ప‌టికే గుంటూరులోవార‌సులు పెరిగిపోయారు. చంద్ర‌బాబు త‌న వారసుడికి సీటు ఇచ్చుకోవాలి. కోడెల కుమారుడు శివ‌రామ‌కృష్ణ ఎదురు చూస్తున్నారు. అదే విధంగా దివంగ‌త లాల్‌జానా బాషా కుమారుడు కూడా పోటీలో ఉన్నారు. దీంతో రంగారావుకు చోటు లేకుండా పోయింద‌నే వాద‌న వినిపిస్తోంది. పోనీ. వైసీపీలోకి వెళ్తారా? అంటే.. వెళ్లాల‌నే ఉన్నా.. ఇప్పుడు గుంటూరులో వైసీపీకి కావాల్సినంత మంది నేత‌లు ఉన్నారు. ఈ నేప‌థ్యంలో ఎవ‌రూ రాయ‌పాటి వైపు క‌న్నెత్తి చూడ‌డం లేదు. ఫ‌లితంగా రాయ‌పాటి కుటుంబం డోలాయ‌మానంలో ప‌డింది. చంద్ర‌బాబు ద‌య చూపాల‌ని.. త‌న కుమారుడికి భ‌విష్య‌త్తు క‌ల్పించాల‌ని కోరుతూ.. రాయ‌పాటి లేఖ రాయ‌డం జిల్లాలో చ‌ర్చ‌నీయాంశంగా మారింది.