సంచలనం: హిజ్బుల్ ఛీఫ్ ఎన్ కౌంటర్

జమ్మూ-కాశ్మీర్ లో సైన్యానికి అతిపెద్ద విజయం సిద్దించింది. మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టు, హిజ్బుల్ ముజాహిద్దీన్ (కాశ్మీర్) చీఫ్ డాక్టర్ సైఫుల్లాను భద్రతా దళాలు ఎన్ కౌంటర్ చేశాయి. డాక్టర్ సైఫుల్లా కోసం భద్రతాదళాలు చాలా కాలంగా గాలిస్తున్నాయి. శ్రీ నగర్ ప్రాంతంలోని రంగైత్ ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్లో కొందరు టెర్రరిస్టులు చనిపోయారు. చనిపోయిన వాళ్ళని గుర్తించేక్రమంలో డాక్టర్ సైఫుల్లా ఉండటంతో భద్రతా దళాలు ఆశ్చర్యపోయాయి. ఎందుకంటే డాక్టర్ లాంటి అత్యంత భద్రత కలిగిన తీవ్రవాదుల లీడర్ స్వయంగా ఎన్ కౌంటర్లో పాల్గొంటాడని భద్రతా దళాలు ఊహించలేదు.

గతంలో హిజ్బుల్ ముజాహిద్దీన్ చీఫ్ గా పనిచేసిన రియాజ్ నైకూ కూడా ఎన్ కౌంటర్లోనే మరణించాడు. అప్పటి నుండి డాక్టరే చీఫ్ గా పనిచేస్తున్నాడు. కాశ్మీర్ లో జరిగిన చాలా పేలుళ్ళకు డాక్టర్ చేసిన ప్లానింగే కారణమని భద్రతా దళాలు చెప్పాయి. అలాంటి మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టు లీడర్ సైఫుల్లా చనిపోవటం ఉగ్రవాదులకు పెద్ద దెబ్బగానే సైన్యం భావిస్తోంది.

ఎన్ కౌంటర్ జరిగిన ప్రాంతం నుండి భారీ ఎత్తున ఆయుధాలు, మందుగుండు సామగ్రిని పోలీసులు, సైన్యం స్వాధీనం చేసుకుంది. జమ్మూ-కాశ్మీర్ లోయలో ఇప్పటివరకు జరిగిన అనేక కాల్పులు, పేలుళ్ళు తదితరాల్లో హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాదులున్న విషయం అందరికీ తెలిసిందే. పొరుగునున్న పాకిస్ధాన్ సరిహద్దుల్లో నుండి రెగ్యులర్ గా తీవ్రవాదులు భారత్ సరిహద్దుల్లోకి చొరబడుతున్నారు. ఇలా కాశ్మీర్ లోయలోకి వచ్చే ఉగ్రవాదులందరికీ హిజ్బుల్ ముజాహిద్దీనే ఆశ్రయం కల్పిస్తోందంటూ స్ధానిక పోలీసులు, భద్రతా దళాలు ఎప్పటి నుండో మొత్తకుంటున్నాయి.

ఎప్పుడైతే హిజ్బుల్ ముజాహిద్దీన్ చీఫ్ డాక్టర్ సైఫుల్లా ఎన్ కౌంటర్లో మరణించాడన్న విషయం తెలియగానే పాకిస్ధాన్ సైన్యం మండిపోయింది. అందుకనే కతువా, పూంఛ్ జిల్లాల్లోని సరిహద్దులో నేరుగా పాకిస్ధాన్ సైన్యమే కాల్పులకు తెగబడింది. భారత సైన్యం ఎటువంటి కవ్వింపులకు పాల్పడకపోయినా దాయాది సైన్యమే ఏకపక్షంగా కాల్పులకు దిగటం ఆశ్చర్యపరిచింది. అయితే కొద్దిసేపటకి భారత దళాలు కూడా అంతేస్ధాయిలో ఎదురుకాల్పులకు దిగటంతో పాకిస్ధాన్ సైన్యం తోక ముడిచింది.