అర్జున్ రెడ్డి డైరెక్టర్ హర్టయ్యాడు

ఒకప్పుడు పూరి జగన్నాథ్ మంచి ఊపులో ఉన్న సమయంలో వరుసగా సొంత బేనర్లోనే సినిమాలు చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది. కొందరు నిర్మాతలతో తలనొప్పులు వచ్చేసరికి ఇకపై తాను చేసే ప్రతి సినిమా సొంత బేనర్లోనే ఉంటుందని.. బయటి బేనర్లకు సినిమాలు చేయనని ప్రకటన చేసి ఆశ్చర్యపరిచాడు పూరి. అన్నమాట ప్రకారమే ‘ఇడియట్’తో మొదలుపెట్టి ‘అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి’, ‘శివమణి’.. ఇలా వరుసగా సొంత బేనర్లోనే సినిమాలు చేస్తూ పోయాడు. కానీ ఆ మాటకు కట్టుబడి ఉండటం పూరి వల్ల కాలేదు. తర్వాత బయటి బేనర్లకు సినిమాలు చేయడం మొదలుపెట్టాడు.

ఇప్పుడు ఛార్మి సహకారంతో మళ్లీ ప్రొడక్షన్ తనే చూసుకుంటున్నాడు. ఇప్పుడు యంగ్ సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ సైతం ఇలాగే శపథం చేయడం విశేషం. ఇకపై తన ప్రతి సినిమానూ సొంత బేనర్లోనే చేస్తానని అతను తాజాగా ఒక ఇంటర్వ్యూలో ప్రకటన చేశాడు.

తన తొలి చిత్రం ‘అర్జున్ రెడ్డి’కి నిర్మాతలు దొరక్కో, క్రియేటివ్ ఫ్రీడమ్ కోసమో సొంత బేనర్లోనే చేశాడు సందీప్. ఆ తర్వాత ‘అర్జున్ రెడ్డి’ని హిందీలో రీమేక్ చేసే అవకాశం వస్తే వేరే నిర్మాతలతో కలిసి తీశాడు. ఇవి రెండూ అద్భుతమైన ఫలితాలందించాయి. ఐతే ‘కబీర్ సింగ్’ నిర్మాతలతోనే ఆ మధ్య తన కొత్త చిత్రాన్ని సందీప్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. కానీ అది ఎంతకీ పట్టాలెక్కలేదు. కోరుకున్న కాంబినేషన్ కుదరకే ఆ సినిమా మొదలు కాలేదని వార్తలొచ్చాయి.

తర్వాత సందీప్ ఏదో చిన్న సినిమా చేస్తున్నాడని, వెబ్ సిరీస్ మొదలుపెడుతున్నాడని వార్తొచ్చాయి. కానీ ఇప్పటిదాకా ఏదీ ఖరారవ్వలేదు. ఐతే తాను ట్రావెల్ చేస్తున్న నిర్మాతలతో సందీప్‌కు విభేదాలొచ్చాయని, అందుకే హర్టయి.. వేరే నిర్మాతలకు సినిమాలు చేయొద్దని, సొంత బేనర్లో మాత్రమే చేయాలని ఫిక్సయినట్లు చెబుతున్నారు.

ఐతే సొంత బేనర్లో అయితేనే రాజీ లేకుండా సినిమాలు చేయొచ్చని, క్రియేటివ్ ఫ్రీడమ్ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నానని సందీప్ స్పష్టం చేశాడు. ఐతే ఏ బేనర్లో చేసినా సరే.. సందీప్ లాంటి ఎగ్జైటింగ్ డైరెక్టర్ నుంచి ‘అర్జున్ రెడ్డి’ తర్వాత వేరే కథతో కొత్త సినిమాను సాధ్యమైనంత త్వరగా చేయాలని అతడి అభిమానులు కోరుకుంటున్నారు.