బీజేపీ నేతపై వీర్రాజు సీరియస్ .. సస్పెన్షన్

బీజేపీ నేత లంకా దినకర్ ను పార్టీలో నుండి సస్పెండ్ చేసింది. బీజేపీలో ఉంటు తెలుగుదేశంపార్టీ అనుకూల వైఖరిని అవలంభిస్తున్న కారణంగానే దినకర్ ను సస్పెండ్ చేస్తున్నట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధనరెడ్డి ప్రకటించారు. మొన్నటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓపోయిన తర్వాత దినకర్ ఆ పార్టీకి రాజీనామా చేసి కమలంపార్టీలో చేరారు. టీడీపీలో దినకర్ అధికారపార్టీ ప్రతినిధిగా పనిచేసిన విషయం అందరికీ తెలిసిందే.

టీడీపీలో నుండి బీజేపీలోకి ముగ్గురు రాజ్యసభ ఎంపిలు సుజనా చౌదరి, సీఎం రమేఫ్, గరికపాటి మోహన్ రావు ఫిరాయించిన విషయం తెలిసిందే. వీరితో పాటు మరికొందరు టీడీపీ నేతలు కూడా అప్పుడే కమలంపార్టీలో చేరారు. వీళ్ళు టీడీపీలో నుండి బీజేపీలో చేరినా చంద్రబాబునాయుడు అనుకూల వైఖరే అవలంభిస్తున్నరనే ఆరోపణలు బలంగా వినిపించేవి. ఇదే విషయమై పార్టీలో పెద్ద ఎత్తున చర్చలు కూడా జరిగాయి. అయితే అప్పట్లో రాష్ట్ర అధ్యక్షునిగా కన్నా లక్ష్మీనారాయణ ఉన్న కారణంగా ఎవరిపైనా ఎటువంటి చర్యలు తీసుకోలేదు.

అయితే కన్నా స్ధానంలో అధ్యక్షునిగా సోమువీర్రాజు బాధ్యతలు తీసుకున్న తర్వాత పార్టీలో సీన్ మారిపోయింది. చంద్రబాబుకు మద్దతుగా మాట్లాడే నేతలను కట్టడి చేయటంపైనే ప్రధాన దృష్టి పెట్టారు. దాంతో బీజేపీలో ఉంటూ టీడీపీ అనుకూల వైఖరితో మాట్లాడేవారిని కట్టడి చేసినట్లయ్యింది. సుజనా లాంటి వాళ్ళు ఈ కారణంగానే ఎక్కడా నోరిప్పటం లేదు. ఇందులో భాగంగానే లంకా దినకర్ కు కూడా పార్టీ తరపున నోటీసులు జారీ అయ్యాయి. బీజేపీలో ఉంటు టీడీపీ అనుకూల వైఖరితో ఎలా మాట్లాడుతున్నారంటూ సోము మండిపడ్డారు.

అయినా దినకర్ వైఖరిలో మార్పు రాలేదన్న కారణంతో షోకాజ్ నోటీసు కూడా ఇచ్చారు. దానికి దినకర్ సరైన సమాధానం ఇవ్వని కారణంగా తాజాగా పార్టీ నుండి సస్పెండ్ చేసినట్లు ప్రకటించారు. కమలంపార్టీలో ఉన్నపుడు తమ పార్టీ వైఖరికి మద్దతుగా మాత్రమే మాట్లాడాలని సోము స్పష్టంగా చెప్పారు. తమ పార్టీలో ఉంటు మరోపార్టీ వైఖరిని అవలంభించటం ఎంతమాత్రం సహించేది లేదని సస్పెన్షన్ ద్వారా వీర్రాజు గట్టి వార్నింగ్ పంపటం గమనార్హం.