నాగ్ మొదలెట్టాడు.. టాలీవుడ్ అందుకుంది

వరదలతో అల్లాడిపోతోంది హైదరాబాద్. నగరంలో కనీ వినీ ఎరుగని వరుణుడి బీభత్సానికి ఎంత నష్టం జరిగిందో అంచనా వేయడం కూడా కష్టంగా ఉంది. వేల కోట్లల్లో ఆస్తులు ధ్వంసమయ్యాయి. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. బాగా బతికిన వాళ్లు కూడా ఇప్పుడు తిండీ నీళ్లు దొరక్క అల్లాడుతున్నారు. వారిని ఆదుకోవడానికి ప్రభుత్వం తన వంతుగా ప్రయత్నం చేస్తోంది. సాయం కోసం కేంద్రాన్ని అర్థిస్తే ఎలాంటి స్పందన కనిపించడం లేదు.

ఈ తరుణంలో తెలంగాణ ప్రభుత్వానికి అండగా నిలిచేందుకు ఏపీ సర్కారు ముందుకొచ్చింది. సాయాన్ని ప్రతిపాదించింది. తమిళనాడు ప్రభుత్వం సైతం తెలంగాణ సర్కారుకు తన వంతుగా సాయం అందించింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వానికి తోడ్పాటు అందించేందుకు తెలుగు సినీ పరిశ్రమ నుంచి తొలి అడుగు వేశాడు సీనియర్ హీరో అక్కినేని నాగార్జున.

వరద సాయం కింద అత్యవసరంగా రూ.550 కోట్లను విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వాన్ని అభినందించిన నాగ్.. తన వంతుగా వరద బాధితుల కోసం సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.50 లక్షల విరాళాన్ని ప్రకటించాడు నాగ్. ఇంతకుముందు మరో సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ రూ.1.5 కోట్ల రూపాయల విరాళాన్ని వరద సాయంగా ప్రకటించినట్లు వార్తలొచ్చాయి. కానీ అది ఫేక్ న్యూస్ అని తేలింది.

ఐతే ఇప్పుడు నాగ్ స్వయంగా ఈ విరాళం గురించి ప్రకటన చేశాడు. అక్కినేని హీరో సాయం ప్రకటించిన కొన్ని నిమిషాలకే ఆయన్ని బాబాయిగా పిలుచుకునే జూనియర్ ఎన్టీఆర్ స్పందించడం విశేషం. హైదరాబాద్ వరదల గురించి ఆవేదన వ్యక్తం చేసిన తారక్.. తన వంతుగా సీఎం సహాయనిధికి రూ.50 లక్షల విరాళం ప్రకటిస్తున్నట్లు వెల్లడించాడు. మరోవైపు విజయ్ దేవరకొండ రూ.10 లక్షలు.. త్రివిక్రమ్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అధినేత రాధాకృష్ణ తలో రూ.5 లక్షలు విరాళం ప్రకటించారు. ఆ వెంటనే మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబు సైతం సాయానికి ముందుకొచ్చారు. వాళ్లిద్దరూ తలో కోటి చొప్పున విరాళం ప్రకటించడం విశేషం. ఇక సినీ పరిశ్రమ నుంచి మరింత మంది సాయానికి ముందుకు రావడం ఖాయం.