ప్రపంచకప్‌లో అలా.. ఐపీఎల్‌లో ఇలా.. ఎందుకలా?

గత ఏడాది వన్డే ప్రపంచకప్ ఫైనల్లో స్కోర్లు సమం కావడం, ఆ తర్వాత సూపర్ ఓవర్ నిర్వహిస్తే అది కూడా టై కావడం.. ఐతే మ్యాచ్‌లో ఎక్కువ బౌండరీలు బాదినందుకు ఇంగ్లాండ్‌కు ప్రపంచకప్ దక్కడం తెలిసిన సంగతే. అప్పుడు అందరూ న్యూజిలాండ్‌ పరిస్థితి చూసి అయ్యో అనుకున్నారు. కేవలం బౌండరీలు ఎక్కువ కొట్టినందుకు ఒక జట్టుకు ప్రపంచకప్ ఇచ్చేయడం ఎంత వరకు సమంజసం అన్న ప్రశ్న తలెత్తింది. ఈ నిబంధనను అందరూ తప్పుబట్టారు. ఇది అన్యాయం అన్నారు. ఐతే సూపర్ ఓవర్‌కు సంబంధించి నిబంధనలు ఎప్పట్నుంచో అలాగే ఉన్నాయి.

అంతర్జాతీయ క్రికెట్లో అయినా, ఐపీఎల్ లాంటి దేశవాళీ లీగ్‌ల్లో అయినా ఎప్పట్నుంచో అనుసరిస్తున్న పద్ధతి ఇదే. కానీ ఆదివారం రాత్రి ముంబయి ఇండియన్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో మ్యాచ్‌లో మాత్రం సూపర్ ఓవర్ టై అయితే బౌండరీలు ఎక్కువ కొట్టిన జట్టును విజేతగా ప్రకటించలేదు. మళ్లీ ఒక సూపర్ ఓవర్ నిర్వహించారు.

ఇది అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఐతే చాలామందికి తెలియని విషయం ఏంటంటే.. గత ఏడాది ప్రపంచకప్ ఫైనల్లో సూపర్ ఓవర్ నిబంధనల విషయంలో తీవ్ర విమర్శలు రావడంతో ఐసీసీ రూల్స్ మార్చింది. సూపర్ ఓవర్ సమమైతే ముందులా బౌండరీల్ని బట్టి విజేతను నిర్ణయించే నిబంధనను రద్దు చేసింది. ఆ పరిస్థితుల్లో మళ్లీ సూపర్ ఓవర్ నిర్వహించేలా రూల్స్ మార్చింది. ఆ ప్రకారమే ఆదివారం రెండో సూపర్ ఓవర్ ఆడించారు. కాగా రెండో సూపర్ ఓవర్ విషయంలోనూ కొన్ని నిబంధనలున్నాయి.

తొలి సూపర్ ఓవర్లో బౌలింగ్ చేసిన వాళ్లు రెండో సూపర్ ఓవర్లో బంతి అందుకోవడానికి వీల్లేదు. అలాగే తొలి సూపర్ ఓవర్లో ఔటైన బ్యాట్స్‌మెన్‌తో రెండోదాంట్లో బ్యాటింగ్‌కు రాకూడదు. అందుకే తొలి సూపర్ ఓవర్లో బౌలింగ్ చేసిన బుమ్రా, షమి కాకుండా తర్వాత జోర్డాన్, బౌల్ట్ బౌలింగ్ చేశారు. బ్యాట్స్‌మెన్ విషయానికి వస్తే రాహుల్, పూరన్ ఔటయ్యారు కాబట్టి తర్వాత బ్యాటింగ్‌కు రాలేదు. ముంబయి జట్టులో డికాక్ ఔటయ్యాడు కాబట్టి అతను రాలేదు. రోహిత్ శర్మకు అవకాశం ఉన్నా అతను కాకుండా పొలార్డ్, హార్దిక్ పాండ్యలు బ్యాటింగ్‌కు దిగారు.