బాలయ్యకు వీళ్లు చేస్తోంది మంచా చెడా?

నందమూరి బాలకృష్ణ పేరు నిన్న సోషల్ మీడియాలో కొన్ని గంటల పాటు మార్మోగిపోయింది. బాలయ్యను దాన కర్ణుడిగా అభివర్ణిస్తూ అభిమానులు రెచ్చిపోయి ట్వీట్లు వేసేశారు. బాలయ్య సేవా భావాన్ని తెగ పొగిడేశారు. హైదరాబాద్ వరద బాధితులకు బాలయ్య కోటిన్నర రూపాయల సాయం అందజేశాడని, వెయ్యి మందికి ఆహారం అందిస్తున్నాడన్న వార్త కొన్ని గంటల్లోనే నెట్టింట తెగ చక్కర్లు కొట్టేసింది. కానీ చివరికి చూస్తే అది ఫేక్ న్యూస్ అని తేలింది.

బాలయ్యకు ఇలాంటి ఉద్దేశం ఉందో ఏమో తెలియదు కానీ.. ప్రస్తుతానికైతే ఆయన విరాళం లాంటిదేమీ ప్రకటించలేదు. కానీ బాలయ్యను గొప్పవాడిగా ప్రొజెక్ట్ చేద్దామని ఆయన అభిమానులు చేసిన ప్రయత్నం బెడిసి కొట్టింది. ఇలాంటి ప్రచారాల వల్ల బాలయ్యకు జరిగిన మేలు కంటే నష్టమే ఎక్కువ అన్నది అభిమానులు గుర్తించలేకపోతున్నారు.

గతంలో కూడా ఒకట్రెండు సందర్భాల్లో బాలయ్య గురించి ఇలాంటి ఫేక్ న్యూస్‌లు ప్రచారంలోకి వచ్చాయి. వేరే హీరోల విషయంలోనూ ఇలా జరిగింది. విరాళం ఇచ్చారన్న ప్రచారంతో కొన్ని గంటల పాటు హీరోల పేర్లు బాగానే ప్రచారంలో ఉంటాయి. ఆ న్యూస్ అబద్ధం అని తేలాక వాళ్లు అన్‌పాపులర్ అవుతారు. వాళ్ల గురించి నెగెటివ్ అభిప్రాయం పడుతుంది జనాల్లో. బాలయ్య విషయంలోనూ ఇప్పుడు తలెత్తిన ఇబ్బంది ఇదే.

ఇప్పుడు జరిగిన ప్రచారం వల్ల బాలయ్య విరాళం ప్రకటించాల్సిన పరిస్థితిలో పడ్డాడు. ఆయన ఆ పని చేస్తే మిగతా టాలీవుడ్ హీరోలు కూడా ఆ బాటన పట్టాల్సి ఉంటుంది. ఐతే ఆల్రెడీ కరోనా కోసం పెద్ద ఎత్తునే విరాళాలు అందజేశారు మన ఫిలిం సెలబ్రెటీలు. పైగా గత ఆరేడు నెలల్లో సినిమాలు చేయక వాళ్లు ఆదాయం కోల్పోయారు. ఈ పరిస్థితుల్లో మళ్లీ విరాళాలు అంటే అందరూ ముందుకు రాకపోవచ్చు. అందుకే బాలయ్య విరాళం లాంటిదేమీ ప్రకటించే అవకాశాలు లేనట్లే. అభిమానులు ఇలాంటి ఫేక్ ప్రచారంతో తమ హీరోలకు చేసే మేలు కంటే చెడే ఎక్కువన్నది గుర్తిస్తే మంచిది.