వైసీపీలో రెండో ర‌కం నేత‌లు.. నిఘా ఉన్నా బ‌లాదూర్!

అధికార వైసీపీలో రెండో ర‌కం నేత‌లు ఉన్నారా? పార్టీలో ఉంటూ.. పార్టీ పంచ‌న అధికారం చ‌లాయిస్తూ.. పార్టీకే వెన్నుపోటు పొడుస్తున్నారా? అంటే.. ఔన‌నే అంటున్నారు సీనియ‌ర్ నాయ‌కులు. అంతేకాదు, వీరి విష‌యంలో సంచ‌ల‌న అంశం ఏంటంటే.. ఇలాంటి వారిపై పార్టీలో నిఘా ఉండ‌డం! అయినా కూడా నేత‌లు ఎక్క‌డా ఆగ‌డం లేద‌ని, వారు ఏంచేయాల‌ని అనుకుంటున్నారో.. అది చేస్తున్నార‌ని పెద్ద ఎత్తున పార్టీలో చ‌ర్చ జ‌రుగుతోంది. మ‌రి ఆ రెండో ర‌కం నేత‌లు ఎవ‌రు? ఎక్క‌డున్నారు? వారి ఉద్దేశాలు ఏంటి? ఎందుకు వారిపై ఇంత ర‌చ్చ జ‌రుగుతోంది? అనే అంశాలు ఇప్పుడు కీల‌కంగా మారాయి.

మిగిలిన పార్టీల‌కు వైసీపీకి తేడా ఉంది. ఇత‌ర పార్టీల్లో అధినేతల‌పై పెద్ద‌గా కేసులు లేవు. వారు న్యాయ‌స్థానాల చుట్టూ తిరిగిందీ లేదు. కానీ, వైసీపీ విష‌యానికి వ‌స్తే.. పార్టీ అధినేత కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. జైలు జీవితం కూడా గడిపారు. పైగా ప్ర‌తిప‌క్షాల నుంచి ఆయ‌న‌ను ఆర్థిక నేర‌స్తుడ‌నే విమ‌ర్శ‌లు వ‌స్తూనే ఉన్నాయి. అయినా కూడా ఆయ‌ననున‌మ్ముకుని, పార్టీని న‌మ్ముకుని.. వైఎస్ ఫ్యామిలీని న‌మ్ముకుని చాలా మంది నేత‌లు ఉండిపోయారు. గ‌త టీడీపీ హ‌యాంలో అయితే.. అనేక మందికి అవ‌కాశం వ‌చ్చినా.. వారు వైసీపీ గ‌డ‌ప దాట‌కుండా ఉండిపోయారు. జ‌గ‌న్ సీఎం అయితే.. చాల‌ని అనుకున్నారు. ఇక‌, మ‌రికొంద‌రు పార్టీ కోసం అప్పులు చేసి ఖ‌ర్చు చేశారు.

ఇంత అభిమానం చూపించిన వారు అన్ని జిల్లాల‌లోనూ ఉన్నారు. వీరు జ‌గ‌న్‌కు వీరాభిమానులు. అయితే, ఇప్పుడు ఇలాంటి వారే.. రెండో ర‌కం నాయ‌కులుగా మారార‌ని తెలుస్తోంది. పార్టీ అధికారంలోకి వ‌చ్చి ఇన్నాళ్ల‌యినా.. త‌మ‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌ని.. ఎవ‌రెవ‌రో కొత్త‌వారికి ప‌ద‌వులు ఇస్తున్నార‌ని కొన్నాళ్లుగా అసంతృప్తితో ఉన్న వారిలో కొంద‌రు వైసీపీలోనూ ఉంటూ.. యాంటీగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని తెలుస్తోంది. వీరు పార్టీ స‌మాచారాన్ని.. ప్ర‌భుత్వ స‌మాచారాన్ని, నేత‌ల లోగుట్ల‌ను తెలుసుకుని.. ప్ర‌త్య‌ర్థి పార్టీల‌కు, నేత‌ల‌కు, ఓ వ‌ర్గం మీడియాకు చేర‌వేస్తునార‌ట‌. దీంతో ప్ర‌తిప‌క్షాలు ఆధారాల‌తో స‌హావాటిని బ‌ట్ట బ‌య‌లు చేసి నిత్యం ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు సంధిస్తోందని అంటున్నారు వైసీపీ నేత‌లు.

వైసీపీ నేత‌ల వ్య‌క్తిగ‌త విష‌యాలు, ప్ర‌భుత్వ కీల‌క‌ నిర్ణ‌యాలు, ర‌హ‌స్యాలు.. కూడా ప్ర‌త్య‌ర్థి పార్టీల నేత‌ల‌కు ఆధారాల‌తో స‌హా ఎలా అందుతున్నాయ‌నే విష‌యంపై ఆరా తీసిన‌ప్పుడు ఈ రెండో ర‌కం నేత‌ల విష‌యం వెలుగు చూసిన‌ట్టు పార్టీలో ప్ర‌చారం జ‌రుగుతోంది. ప‌ద‌వులు ద‌క్క‌నివారు.. ఇక‌, ద‌క్కుతాయ‌నే ఆశ‌లేనివారు.. పార్టీపై విసుగు చెందిన‌వారు.. నియోజ‌క‌వ‌ర్గాల్లో మంత్రులతో ఉదాసీన‌త‌కు గుర‌వుతున్న‌వారు రెండో రకం నాయ‌కులుగా అవ‌తార‌మెత్తి ప్ర‌త్య‌ర్థుల‌కు స‌మాచారం చేర‌వేస్తున్న‌ట్టు తెలుస్తోంద‌ని అంటున్నారు. నిజానికి ఇలాంటి వారిపై నిఘా ఉన్నా.. ఏమీ చేయ‌లేని ప‌రిస్థితి ఏర్ప‌డింద‌ని అంటున్నారు. వీరిలో పెద్ద పెద్ద త‌ల‌కాయ‌లే ఉన్నాయ‌ని అంటున్నారు. మ‌రి ఇది ఇక్క‌డితో ఆగుతుందో.. మ‌రింత ముదురుతుందో చూడాలి.