అంబానీపై సోనూ సూద్ పంచ్

రీల్ విలన్‌గా ఉన్న సోనూ సూద్.. కరోనా-లాక్‌డౌన్ టైంలో రియల్ హీరో అనిపించుకున్నాడు. అతడి ప్రతి మాటా, ప్రతి చర్యా ఇప్పుడు ఎంతో ప్రాధాన్యం సంతరించుకుంది. తాజాగా అతను చేసిన ఒక ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. ఈ ట్వీట్లో అతను వేసిన పంచ్ భారత కుబేరుడు ముకేష్ అంబానీకి తగలడం విశేషం. కరోనా టైంలో ధనవంతులు మరింత ధనవంతులుగా మారారని.. పేదవాళ్లు మరింత పేదవాళ్లు అయ్యారని తన ట్వీట్లో పేర్కొన్నాడు సోనూ.

కరోనా-లాక్‌డౌన్‌తో అత్యధికంగా ప్రభావితం అయింది కింది స్థాయి వాళ్లే. రోజువారీ ఆదాయంతో బతికే వాళ్లలో చాలామందికి నెలల తరబడి ఉపాధి పోయింది. పేద, మధ్యతరగతి జీవులు లాక్‌డౌన్ టైంలో అల్లాడిపోయారు. వారి కష్టాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. కోట్లాది మంది ఆర్థిక పరిస్థితి తల్లకిందులైంది.

కానీ ఇదే సమయంలో ముకేష్ అంబాని సహా కొందరు కుబేరుల సంపద అమాంతం పెరిగింది. ఈ ఏడాది ఆరంభానికి ముందు ముకేష్ అంబాని సంపద 59 బిలియన్ డాలర్లుగా ఉండగా.. కరోనా అన్ని రంగాలనూ కుదేలు చేసిన కొత్త ఏడాదిలో ముకేష్ సంపద అనూహ్యంగా పెరిగింది. 22 బిలియన్ డాలర్ల వృద్ధితో ఆయన సంపద 79.3 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఆయన ఆధ్వర్యంలోని జియో సంస్థలోకి కరోనా టైంలో భారీగా పెట్టుబడులు వచ్చాయి. ఆయన సంపదను అమాంతం పెంచాయి.

కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ దెబ్బకు అల్లాడిపోయిన కింది స్థాయి వర్గాలకు పెద్దగా చేసిందేమీ లేదు కానీ.. కార్పొరేట్లను మాత్రం తమ పాలసీలతో బాగా ఆదుకుందనే అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలోనే సోనూ సూద్.. అంబాని లాంటి కుబేరులకు గట్టిగా తగిలేలా ట్విట్టర్లో పంచ్ వేశాడు. అతడి ట్వీట్‌కు నెటిజన్ల నుంచి సానుకూల స్పందన వస్తోంది.