ఐదు నిమిషాల ముందు రైలు టికెట్

రిజర్వేషన్ ఉన్న రైళ్లలో ఛార్ట్ ప్రిపేరైపోయాక టికెట్లు బుక్ చేయడం సాధ్యం కాదన్న సంగతి తెలిసిందే. ఐతే ప్రస్తుత ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో రైలు బయల్దేరడానికి ఐదు నిమిషాల ముందు కూడా టికెట్లు బుక్ చేసుకునే సౌలభ్యాన్ని కల్పించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. అక్టోబరు 10, శనివారం నుంచి కొత్తగా పలు రైళ్లు రాకపోకలు సాగిస్తున్న నేపథ్యంలో రైలు స్టేషను నుంచి బయలుదేరే ఐదు నిమిషాల ముందు కూడా రైల్వే సీట్లు ప్రయాణికులకు అందుబాటులో ఉంచనున్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది.

కరోనా సంక్షోభం నేపథ్యంలో కొన్ని నెలల పాటు రైళ్లన్నీ ఆగిపోయాయి. ఐతే అన్‌లాక్‌లో భాగంగా దశల వారీగా రైళ్లను పెంచుతోంది రైల్వే శాఖ. శనివారం నుంచి పెద్ద ఎత్తున రైళ్లను పునరుద్ధరిస్తున్నారు. ఈ నేపథ్యంలో రైలు బయలుదేరే సమయానికి అరగంట ముందు రెండో రిజర్వేషన్ ఛార్టు తయారు చేయాలని రైల్వేశాఖ నిర్ణయించింది.

మామూలుగా రైలు బయలుదేరడానికి కనీసం నాలుగు గంటల ముందు ఛార్టు తయారు చేస్తారు. ఆ ఛార్టు తయారయ్యాక రైలులో సీట్లు ఖాళీగా ఉంటే రెండవ ఛార్టు తయారు చేసే వరకు పీఆర్ఎస్ కౌంటర్ల ద్వారా, ఆన్ లైన్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చని రైల్వే అధికారులు చెప్పారు. ఇలా రైలు బయల్దేరడానికి ఐదు నిమిషాల ముందు వరకు కూడా టికెట్ బుక్ చేసుకునే సౌలభ్యం ఉంది.

ఇదిలా ఉండగా దసరా, దీపావళి పండుగల నేపథ్యంలో దేశవ్యాప్తంగా అక్టోబరు 15 నుంచి నవంబరు 30 వరకు 39 ప్రత్యేక రైళ్లను నడపాలని రైల్వేశాఖ నిర్ణయించింది. వీటిలో తెలుగు రాష్ట్రాల మధ్య కూడా కొన్ని రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. ఐతే కరోనాకు ముందున్న రైళ్లన్నింటినీ పునరుద్ధరించడానికి మాత్రం మరి కొన్ని నెలలు సమయం పట్టే అవకాశముంది.