త‌మిళ రాజ‌కీయాల్లో మోడీ కీల‌క వ్యూహం.. ప‌ళ‌ని ఎంపిక వెనుక ఏం జ‌రిగింది?

త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లో ఆస‌క్తికర ఘ‌ట్టం పూర్త‌యింది. వ‌చ్చే ఏడాది ఈ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ క్ర‌మంలో అధికార అన్నాడీఏంకే పార్టీలో సీఎం అభ్య‌ర్థి విష‌యంపై నిన్న మొన్న‌టి వ‌ర‌కు ఎడ‌తెగ‌ని పీకులాట చోటు చేసుకుంది. నేనంటే నేనేన‌ని, సీఎం ప‌ళ‌నిస్వామి, డిప్యూటీ సీఎంగా ఉన్న ప‌న్నీర్ సెల్వంలు పోటీ ప‌డ్డారు. వీరిలో ఎవ‌రో ఒక‌రిని ఎంపిక చేయ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి. ఈ క్ర‌మంలో ఈ విష‌యం అన్నాడీఎంకేలో త‌ల‌నొప్పిగా ప‌రిణ‌మించింది. ప్ర‌జాబ‌లం, రాజ‌కీయ చ‌తుర‌త‌లో.. ఇద్ద‌రూ స‌మ ఉజ్జీలుగా పేరు తెచ్చుకున్నారు. అదేస‌మ‌యంలో అమ్మ జ‌య‌ల‌లితను ఆరాధించ‌డంలోనూ పోటీనే!

నిజానికి జయలలిత మృతి తర్వాత సీఎం అయ్యే అవకాశం తొలుత పన్నీర్‌ సెల్వంకే వచ్చింది. అయితే కొన్నాళ్లకే ఆయన శశికళపై తిరుగుబాటు చేసి పార్టీని చీల్చారు. కానీ సరిపడినంత ఎమ్మెల్యేల బలం లేక పదవిని కోల్పోయారు. ఈ నేప‌థ్యంలో కేంద్రంలోని న‌రేంద్ర మోడీ ఇక్క‌డ చ‌క్రం తిప్పార‌నేది వాస్త‌వం. ఆయ‌న క‌నుస‌న్న‌ల్లో జ‌రిగిన వ్యూహాల నేప‌థ్యంలో శ‌శిక‌ళ‌పై ఉన్న కేసులు విచార‌ణ ఊపందుకోవ‌డం, ఆమె జైలుకు వెళ్ల‌డం, బీజేపీకి సానుకూల ధోర‌ణితో వ్య‌వ‌హించేలా.. ప‌ళ‌నిస్వామిని ఒప్పించ‌డం.. వంటివి జ‌రిగిపోగా.. ప‌న్నీరును త‌ప్పించి ప‌ళ‌నిని సీఎం పీఠం ఎక్కించారు. అయితే, ఇప్పుడు మ‌ళ్లీ ఎన్నిక‌లు ఉన్న నేప‌థ్యంలో ఇక్క‌డ ఏర్ప‌డిన ప్ర‌తిష్టంభ‌న‌తోపాటు.. అధికార పార్టీపై ప‌ట్టు పెంచుకునేందుకు మోడీ వ్యూహాత్మ‌కంగా పావులు క‌దిపిన‌ట్టు తెలుస్తోంది.

గ‌త వారం.. త‌మిళ‌నాడు ప్ర‌భుత్వంలోని కీల‌క మంత్రి ఒక‌రు.. ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీని క‌లిసిన‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. అదేస‌మ‌యంలో గ‌తంలో లోక్‌స‌భ డిప్యూటీ స్పీక‌ర్‌గా ఉన్న అన్నాడీఎంకే మాజీ ఎంపీ… సీనియ‌ర్ నాయ‌కుడు తంబిదురై కూడా ఢిల్లీలో బీజేపీ వ‌ర్గాల‌ను క‌లిసిన‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. ఈ నేప‌థ్యంలోనే రాష్ట్రం సీఎం అభ్య‌ర్థి వ్య‌వ‌హారంపై నెల‌కొన్న ప్ర‌తిష్టంభ‌న‌ను తొల‌గించేలా.. చ‌ర్చ‌లు జ‌రిగాయ‌ని.. ఈ విష‌యంలో మోడీ క‌నుస‌న్న‌ల్లో అన్నాడీఎంకే వ్య‌వ‌హ‌రిస్తోంద‌నే వార్త‌లు వెలువ‌డుతున్నాయి. త‌మ‌కు అనుకూలంగా ఉన్న ప‌ళ‌ని స్వామినే తిరిగి సీఎం అభ్య‌ర్థిగా ప్ర‌క‌టిచేలా బీజేపీ నేత‌లు చ‌క్రం తిప్పార‌ని తెలిసింది.

ఇదిలావుంటే, నిన్న మొన్న‌టి వ‌ర‌కు సీఎం అభ్య‌ర్థి విష‌యంలో గ‌ట్టిగా ప‌ట్టుబ‌ట్టిన ప‌న్నీర్ సెల్వం ఢిల్లీ ప‌రిణామాల నేప‌థ్యంలో మ‌న‌సు మార్చుకున్నారు. అంతేకాదు.. ‘‘నా ప్రియ సోదరుడు పళనిస్వామిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది“ అని ప‌న్నీర్ స్వ‌యంగా ప్ర‌క‌టించ‌డం నిజంగానే సంచ‌ల‌నానికి వేదిక అయింది. ఈ ప‌రిణామం గ్ర‌హించిన త‌ర్వాత‌.. ఖ‌చ్చితంగా ఢిల్లీ పెద్ద‌లే చ‌క్రం తిప్పార‌ని.. లేకుంటే ఇది సాధ్య‌మ‌య్యేది కాద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మొత్తానికి ప‌ట్టులేని రాష్ట్రంలోనూ రాజ‌కీయాలను త‌మ క‌నుస‌న్న‌ల్లో మోడీ న‌డిపిస్తున్నార‌న్న వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. ఈ రాష్ట్రంలో మ‌రో ఐదు నెల‌ల్లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి.