ఎవరీ రాహుల్ త్రిపాఠి?

రాహుల్ త్రిపాఠి.. ఉన్నట్లుండి ఐపీఎల్ అభిమానుల చర్చల్లోకి వచ్చిన పేరు. బుధవారం రాత్రి బౌలర్ల ఆధిపత్యం సాగిన కోల్‌కతా నైట్‌రైడర్స్-చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్‌లో హీరోగా నిలిచాడీ కుర్రాడు. చెన్నై బౌలర్ల ధాటికి కోల్‌కతా స్టార్ ఆటగాళ్లందరూ చేతులెత్తేస్తే.. అతను 51 బంతుల్లోనే 81 పరుగులు చేసి వారెవా అనిపించాడు. నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్‌లో సెకండ్ బెస్ట్ స్కోర్ 17 పరుగులు మాత్రమే. ఆ జట్టు ఆలౌట్ కూడా అయింది. దీన్ని బట్టి రాహుల్ ఇన్నింగ్స్‌ ఎంత విలువైందో అర్థం చేసుకోవచ్చు.

బ్యాటింగ్ కష్టంగా సాగిన పిచ్ మీద ఆ తర్వాత బలమైన బ్యాటింగ్ ఆర్డర్ ఉన్న చెన్నై కూడా సరిగా ఆడలేకపోయింది. 168 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక 20 ఓవర్లలో 5 వికెట్లకు 157 పరుగులే చేసింది. మొత్తంగా రెండు జట్ల బ్యాట్స్‌మెన్ ఇబ్బంది పడ్డ వికెట్ మీద రాహుల్ త్రిపాఠి చెలరేగి ఆడి తన సత్తా ఏంటో చూపించాడు.

నిజానికి కోల్‌కతా ఆడిన తొలి మూడు మ్యాచుల్లో రాహుల్‌కు జట్టులో చోటే లేదు. నాలుగో మ్యాచ్‌లో ఆడించారు. అది కూడా లోయర్ మిడిలార్డర్లో. ఐతే ఆ మ్యాచ్ చివర్లో వచ్చి మెరుపులు మెరిపించాడు. కేవలం 16 బంతుల్లో 36 పరుగులు చేశాడు. అతడి సత్తా ఏంటో అర్థమైన కోల‌్‌కతా టీమ్ మేనేజ్మెంట్ తర్వాతి మ్యాచ్‌కు సునీల్ నరైన్‌ను పక్కన పెట్టి త్రిపాఠిని ఓపెనర్‌గా పంపింది. స్వతహాగా ఓపెనరే అయిన త్రిపాఠి వచ్చిన అవకాశాన్ని పూర్తిగా ఉపయోగించుకుని మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఈ కుర్రాడిది మహరాష్ట్ర. దూకుడైన ఓపెనర్‌గా దేశవాళీల్లో మంచి పేరే సంపాదించాడు.

2017లో అతను ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. తొలి సీజన్లో పుణె సూపర్‌జెయింట్‌కు ఆడాడు. ఓపెనర్‌గా మంచి ప్రదర్శనే చేశాడు. యంగ్ టాలెంట్‌ను ప్రోత్సహించే రాజస్థాన్ రాయల్స్ తర్వాతి ఏడాది అతణ్ని తమ జట్టులోకి తీసుకుంది. కానీ వరుసగా రెండు సీజన్లలోనూ తుది జట్టులో చోటివ్వలేదు. దీంతో అతను మరుగున పడిపోయాడు. ఈసారి కోల్‌కతా అతణ్ని తీసుకుంది. ఆ జట్టు కూడా ముందు పక్కన పెట్టింది కానీ.. నాలుగో మ్యాచ్‌లో ఆడించగానే తన సత్తా ఏంటో చూపించి ఇప్పుడు ఆ జట్టు ప్రధాన బ్యాట్స్‌మెన్‌లో ఒకడైపోయాడు.