బాండ్ భయపడ్డాడు

2020 సంవత్సరాన్ని ప్రపంచ సినీ పరిశ్రమ అంత సులువుగా మరిచిపోదు. కరోనా ధాటికి అన్ని రంగాలూ దెబ్బ తిన్నాయి కానీ.. సినీ పరిశ్రమకు తగిలిన దెబ్బ అలాంటిలాంటిది కాదు. వరల్డ్ వైడ్ సినీ రంగానికి ఎంత నష్టం వాటిల్లి ఉంటుందో అంచనా వేయడం కూడా కష్టమే. ఆరు నెలలకు పైగా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల్లో సినిమాల విడుదల ఆగిపోయింది.

కొన్ని దేశాల్లో ధైర్యం చేసి సినిమాలు రిలీజ్ చేసినా ఆశించిన రెవెన్యూ లేదు. క్రిస్టోఫర్ నోలన్ లాంటి మేటి దర్శకుడు తన ‘టెనెట్’ చిత్రాన్ని ధైర్యం చేసి విడుదల చేస్తే దానికి బ్రేక్ ఈవెన్ కూడా అవ్వలేదు. మంచి రివ్యూలు వచ్చినా సరే.. చాలా దేశాల్లో సినిమా విడుదల కాకపోవడం, రిలీజ్ చేసిన చోట జనాలు థియేటర్లకు ఆశించిన స్థాయి రాకపోవడంతో ఈ సినిమాకు నష్టాలు తప్పలేదు.

మామూలుగా అయితే ఈ చిత్రానికి 500 మిలియన్ డాలర్లకు తక్కవగా వసూళ్లు వచ్చేవి కావు. కానీ ఇప్పటిదాకా ఈ చిత్రం అందులో సగం వసూళ్లు సాధించలేదు. బ్రేక్ ఈవెన్ మార్కును కూడా అందుకోలేదు.

‘టెనెట్’ రిలీజ్ కావడానికి ముందు వరల్డ్ వైడ్ రిలీజ్ కోసం మరో భారీ చిత్రం ఎదురు చూస్తూ ఉంది. అదే.. జేమ్స్ బాండ్ మూవీ ‘నో టైం టు డై’. ఏప్రిల్లోనే రావాల్సిన ఈ చిత్రాన్ని కరోనా వల్లే వాయిదా వేశారు. నవంబరులో రిలీజ్ చేద్దామనుకున్నారు. కరోనా భయం కొనసాగుతున్నప్పటికీ నవంబరులోనే రిలీజ్ అని నెల కిందట చిత్ర బృందం ధీమాగా చెప్పింది. కానీ రోజులు గడిచే కొద్దీ ఆత్మవిశ్వాసం తగ్గినట్లుంది. ‘టెనెట్’ తరహాలో ఎదురు దెబ్బ తినడం ఎందుకని ఇప్పుడు ఈ చిత్రాన్ని కూడా వాయిదా వేసేశారు.

వచ్చే ఏడాది ఏప్రిల్లో ‘నో టైం టు డై’ని ప్రేక్షకుల ముందుకు తేవాలనుకుంటున్నారు. అప్పటికి పరిస్థితులు బాగుపడతాయని ఆశిస్తున్నారు. 2006లో ‘క్యాసినో రాయల్’తో బాండ్ అవ‌తారం ఎత్తి.. ఆ తర్వాత ‘క్వాంటమ్ ఆఫ్ సోలెస్’, ‘స్కై ఫాల్’, ‘స్పెక్టర్’ సినిమాల్లో బాండ్‌గా కనిపించిన డేనియ‌ల్ క్రెయిగ్‌కు బాండ్ పాత్రలో ‘నో టైం టు డై’నే చివరి సినిమాగా భావిస్తున్నారు. ఈ చిత్రాన్ని కేరీ జోజి రూపొందించాడు.