అక్షయ్ కుమార్ సంచలనం

బాలీవుడ్లో ఇప్పుడు అక్షయ్ కుమార్ ఉన్నంత స్పీడులో ఇంకెవరూ లేరు. ఒక్కో సినిమాకు తీసుకునే పారితోషకం విషయంలో ఆయన్ని మించిన హీరోలుండొచ్చు కానీ.. ఓవరాల్‌గా ఏడాది ఆదాయం తీసుకుంటే మాత్రం అక్షయే నంబర్ వన్. అందుక్కారణం అక్షయ్ ఏటా మూడు నుంచి నాలుగు సినిమాలు పూర్తి చేసి పక్కన పెట్టేస్తాడు. అలాగని అతను క్వాలిటీ విషయంలో ఏమీ రాజీ పడడు.

గత ఏడాది అతను మూణ్నాలుగు సినిమాలతో పలకరించడం విశేషం. అందులో మూడు (కేసరి, మిషన్ మంగల్, గుడ్ న్యూజ్) మంచి విజయం సాధించాయి. సరైన టాక్ రాకున్నప్పటికీ ‘హౌస్‌ ఫుల్-4’ సైతం బాగానే ఆడింది. ఈసారి కూడా మూణ్నాలుగు రిలీజ్‌లు టార్గెట్ పెట్టుకున్నాడు కానీ.. కరోనా బ్రేక్ వేసింది. సూర్యవంశీ, లక్ష్మీబాంబ్ చిత్రాల రిలీజ్ ఆగిపోయింది. అవి అనుకున్న ప్రకారం వచ్చేసి ఉంటే ఇంకో రెండు సినిమాలు రెడీ చేసేవాడేమో.

లక్ష్మీబాంబ్ వచ్చే నెల 9న హాట్‌స్టార్‌లో విడుదల కానుండగా.. ‘సూర్యవంశీ’ థియేటర్లు ఓపెనయ్యాక విడుదలవుతుంది. కరోనా రాకముందే అక్షయ్ అంగీకరించిన ‘బెల్ బాటమ్’ సినిమాను ఈ ఏడాది విడుదల చేయడానికి వీల్లేకపోయింది. దాన్ని వచ్చే వేసవికి అనుకుంటున్నారు. ఐతే ఈ సినిమాను కరోనా టైంలోనే మొదలుపెట్టి సంచలన రీతిలో పూర్తి చేసిన వైనం చూసి అందరూ విస్తుబోతున్నారు.

ఆగస్టులో షూటింగ్‌లు నెమ్మదిగా పున:ప్రారంభమవుతున్న దశలో ఈ సినిమాను మొదలుపెట్టారు. తర్వాత తన టీంతో కలిసి యూరప్‌కు వెళ్లాడు అక్షయ్. ఏదో ఒక షెడ్యూల్ షూటింగ్ చేసుకుని వస్తాడని అనుకుంటే.. మొత్తం సినిమాను పూర్తి చేసేశాడంటూ ఇప్పుడు అప్‌డేట్ బయటికి వచ్చింది. ఎంతో భారీతనంతో కూడుకున్న ఈ చిత్రం కేవలం 38 రోజుల వర్కింగ్ డేస్‌తో పూర్తయిందట. ఇండియాలో 50 మందికి మించి చిత్రీకరణలో పాల్గొనడానికి వీల్లేకపోవడంతో పెద్దగా జనం అవసరం లేని సన్నివేశాలన్నీ ఇక్కడ తీసేసి.. ఎక్కువమంది అవసరం ఉన్న సీన్లను కరోనా ప్రభావం పెద్దగా లేని విదేశాల్లో పూర్తి చేసుకుని వచ్చారు. అంత పెద్ద హీరో, పెద్ద సినిమా.. కరోనా టైంలో ఇలా మొదలై అలా పూర్తయిపోవడం అందరినీ విస్మయానికి గురి చేస్తోంది.