వీళ్ల ప్రచారం కూడా సేమ్ టు సేమ్ మన టైపేనా ?

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష పదవికి పోటి పడుతున్న ఇద్దరు ప్రధాన అభ్యర్ధుల మధ్య జరిగిన డిబేట్ సేమ్ టు సేమ్ మన టైపే అన్న విషయం బయటపడిపోయింది. పేరుకు అగ్రరాజ్యమే అయినా రాజకీయాలకు వచ్చేసరికి మన దగ్గర నేతలు ఎంత చీపుగా మాట్లాడుకుంటారో అమెరికా అధ్యక్ష పదవికి పోటి పడుతున్న ఇద్దరు అభ్యర్ధులు కూడా అంతకంటే తక్కువేమీ కాదన్న విషయం తేలిపోయింది. తాజాగా రిపబ్లికన్ అభ్యర్ధి, ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు డెమక్రాట్ల తరపున పోటి చేస్తున్న జో బైడెన్ కు మధ్య ముఖాముఖి చర్చ జరిగింది.

వివిధ అంశాల్లో ఇద్దరి మధ్య జరిగిన చర్చను ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది ఎంతో ఆసక్తిగా చూశారు. అయితే చర్చను చూసిన వారిలో మెజారిటి తీవ్ర అసంతృప్తికి గురయ్యారనే చెప్పాలి. ఎందుకంటే అగ్రరాజ్యాన్ని మరింత అభివృద్ధి చేయటానికి, ప్రపంచదేశాలతో సంబంధాలు మెరుగుపరుచుకునే విషయం, ఆర్ధిక, రాజకీయ తదితర అంశాలపై నిర్మాణాత్మకమైన వైఖరిని చెబుతారని ఎదురు చూసిన చాలామందికి నిరాస ఎదురైందట. ఎందుకంటే కీలక అంశాల్లో తమ వైఖరి ఏమిటి అని చెప్పే బదులు పరస్పర నిందలతోనే సరిపోయిందట వీళ్ళ చర్చ.

వీళ్ళ ముఖాముఖిని సాంతం చూసిన తర్వాత చర్చల పేరుతో వీళ్ళు చేసుకున్న ఆరోపణలు, విమర్శల అచ్చం మనదేశంలో రాజకీయ నేతల ప్రసంగాల్లాగే ఉన్నాయన్న విషయం అర్ధమైపోయింది. మనదగ్గర కూడా విదానపరమైన విషయాలపై వైఖరులు తెలియజేయటం కన్నా ప్రత్యర్ధులను దెబ్బ కొట్టటానికి ఇబ్బంది పెట్టటానికే వ్యక్తిగత దూషణలకు దిగటం మనకందరికీ తెలిసిందే. ఇదే పద్దతిలో ట్రంప్ కానీ బైడెన్ కానీ చర్చలో ఎక్కువగా వ్యక్తిగత విమర్శలు, ఆరోపణలకే ప్రాధాన్యత ఇవ్వటం విచిత్రంగా ఉంది. మరి కొద్దిరోజుల తర్వాత జరిగే ముఖాముఖిలో అయినా తమ పద్దతి మార్చుకుంటారా అన్నది చూడాల్సిందే.