బన్నీ.. పీటర్ హెయిన్.. డిష్యుం డిష్యుం

తన ఫేవరెట్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో దశాబ్దానికి పైగా విరామం తర్వాత నటించడానికి ఎంతో ఉత్సాహంగా ఉన్నాడు అల్లు అర్జున్. వీళ్ల కలయికలో రాబోతున్న మూడో సినిమా ‘పుష్ప’ మీద ఏ స్థాయిలో అంచనాలున్నాయో తెలిసిందే. ఐతే ఈ ఏడాది ఆరంభంలోనే మొదలు కావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా ఆలస్యమైంది. మళ్లీ షూటింగ్‌లు మొదలైనా సరే.. భారీతనంతో కూడుకున్న ఈ చిత్రాన్ని వెంటనే మొదలుపెట్టే పరిస్థితి లేదు.

ఎక్కువగా అటవీ నేపథ్యంలో సాగే ఈ చిత్రాన్ని చాలా రోజుల పాటు దట్టమైన అడవుల్లో చిత్రీకరించాల్సి ఉంది. అందుకే కేరళ అడవులే సరైన వేదిక అని సుకుమార్ భావిస్తున్నాడు. కానీ అక్కడ వెంటనే షూటింగ్ మొదలుపెట్టే పరిస్థితులు లేవు. వికారాబాద్, మారేడుమిల్లి.. ఇలా రకరకాల అడవుల్ని పరిశీలించారు కానీ.. సుకుమార్ మనసు మాత్రం కేరళ వైపే లాగుతోంది.

గత ఏడాది చివర్లో సుకుమార్ తన టీంతో కేరళకు వెళ్లి ట్రయల్ షూట్ లాంటిది చేసి, లొకేషన్లు ఖరారు చేసుకుని వచ్చి షెడ్యూళ్లు కూడా వేసుకున్నాడు. కానీ కరోనా అన్ని ప్రణాళికలనూ భగ్నం చేసింది. అన్నీ అనుకూలిస్తే నవంబరులో తాను అనుకున్న చోటే చిత్రీకరణ మొదలుపెట్టాలని సుకుమార్ భావిస్తున్నాడు. ఇప్పటికే ఏవేవో కారణాలతో ఆలస్యమైన ఈ చిత్రాన్ని.. వచ్చే నెలలో మొదలుపెట్టి నిర్విరామంగా పని చేసి పూర్తి చేయాలని సుక్కు అనుకుంటున్నాడు.

ఈ నేపథ్యంలో పక్కాగా షెడ్యూల్స్ వేయించే పనిలో ఉన్నాడు. దాంతో పాటు యాక్షన్ ఘట్టాల చిత్రీకరణలో ఆలస్యం కాకుండా హైదరాబాద్‌లో వాటి రిహార్సల్స్ చేయించడానికి రంగం సిద్ధం చేశాడట. ఇండియాలోనే టాప్ యాక్షన్ కొరియాగ్రాఫర్ అయిన పీటర్ హెయిన్ ఆధ్వర్యంలో ఈ పని మొదలుకానుంది. ‘పుష్ప’ పాత్ర కోసం లుక్‌ను పూర్తిగా మార్చుకున్న బన్నీ.. ఈ లుక్‌తోనే రిహార్సల్స్‌‌లో పాల్గొనబోతున్నాడట. ఇవి పక్కాగా జరిగితే తర్వాత అనుకున్నదానికంటే వేగంగా యాక్షన్ ఘట్టాలు పూర్తి చేయొచ్చని భావిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో రష్మిక మందన్నా కథానాయికగా నటించనుంది.