ఉన్న ఒక్క సినిమా కూడా ఊడిందా?

మలయాళ బ్లాక్‌బస్టర్ మూవీ ‘ప్రేమమ్’తో కథానాయికగా పరిచయమైన అనుపమ పరమేశ్వరన్.. తెలుగులోకి కూడా బ్యాంగ్ బ్యాంగ్ ఎంట్రీనే ఇచ్చింది. ‘అఆ’, ‘ప్రేమమ్’, ‘శతమానం భవతి’.. ఇలా ఇక్కడ ఆమె కెరీర్ ఆరంభంలో చేసిన సినిమాలన్నీ సూపర్ హిట్లే. అందం, అభినయం రెండూ ఉన్న అనుపమ చాలా పెద్ద స్థాయికి వెళ్తుందన్న అంచనాలు కలిగాయి.

ఒక దశలో ‘రంగస్థలం’ లాంటి పెద్ద సినిమాను చేజిక్కించుకుని టాప్ స్టార్ అయ్యేలా కనిపించింది అనుపమ. ఐతే ఈ సినిమా అవకాశం చేజారడంతోనే ఆమె కెరీర్ డౌన్ ఫాల్ కూడా మొదలైంది. తన కెరీర్‌కు కలిసొచ్చే సరైన సినిమాలు ఎంచుకోకపోవడం, వరుస ఫ్లాపులు అనుపమను రేసులో వెనక్కి నెట్టేశాయి. ఒకప్పుడు తెలుగులోనే అత్యంత బిజీగా ఉన్న ఆమె.. ఇప్పుడు టాలీవుడ్లో ఉన్నట్లు కూడా ఎవరికీ అనిపించడం లేదు. గత ఏడాది చేసిన ‘రాక్షసుడు’ బాగా ఆడినా సరే.. ఆమె కెరీర్‌కు అది ఎంతమాత్రం ఉపయోగపడలేదు.

లేక లేక ఆమెకు ‘కార్తికేయ-2’లో అవకాశం వచ్చినట్లు ఆ మధ్య వార్తలొచ్చాయి. మేక్ ఆర్ బ్రేక్ ఛాన్స్ లాగా దీన్ని భావించారు. ఎందుకంటే చందూ మొండేటి, నిఖిల్‌ల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ క్రేజీ సీక్వెల్లో కథానాయికకు కూడా మంచి రోలే ఉంటుందని భావించారు. కానీ అనుపమ చేతిలో ఉన్న ఈ ఒక్క తెలుగు సినిమా కూడా ఇప్పుడు చేజారినట్లు వార్తలొస్తున్నాయి.

అనుపమ స్థానంలోకి ‘గ్యాంగ్ లీడర్’ భామ ప్రియాంక అరుల్ మోహన్‌ను తీసుకున్నారట. ఈ సినిమాకు కథానాయికగా ఫ్రెష్ ఫేస్ అయితేనే బాగుంటుందని చందూ ఆమెను ఓకే చేసినట్లు తెలుస్తోంది. అనుపమ ఒకప్పటితో పోలిస్తే లుక్ పరంగా కూడా కొంచెం తేడాగానే కనిపిస్తోంది. ఇటీవలే ఆమె చేసిన ఒక ట్రెడిషనల్ ఫొటోలో బాగా సన్నబడి, ముఖంలో కాంతి కోల్పోయి ఏమంత ఆకర్షణీయంగా కనిపించలేదు అనుపమ. అసలే కెరీర్ అంత ఊపులో లేదు. పైగా లుక్ కూడా డల్ అయ్యేసరికి అవకాశం చేజారిందేమో అనిపిస్తోంది. ఈ వార్త ఖరారైతే మాత్రం తెలుగులో అనుపమ కెరీర్ క్లోజ్ అయిందనుకోవచ్చు.