‘అర్జున్ రెడ్డి’ దర్శకుడి పరిస్థితి ఇలా అయ్యిందేంటి?

‘అర్జున్ రెడ్డి’ సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ. ఐతే ఈ చిత్రం విడుదలై మూడేళ్లు దాటిపోయింది. సందీప్ నుంచి ఇంకో కథ సినిమాగా తెరకెక్కలేదు. మధ్యలో ‘అర్జున్ రెడ్డి’ రీమేక్ ‘కబీర్ సింగ్’తో అతను పలకరించాడు. ఐతే అది రీమేక్ కాబట్టి అతను కొత్తగా చేసిందేమీ లేకపోయింది. ఉన్నదున్నట్లే తీసేశాడు. సెన్సేషనల్ డెబ్యూ మూవీ తర్వాత సందీప్ ఎలాంటి సినిమా తీస్తాడనే ఆసక్తి, ఉత్కంఠ అందరిలోనూ ఉన్నాయి.

సందీప్ కొత్త సినిమా విషయంలో మహేష్ బాబుతో మొదలుపెట్టి రణబీర్ కపూర్ వరకు అనేక పేర్లు తెరపైకి వచ్చాయి. కానీ ఏదీ మెటీరియలైజ్ కాలేదు. ‘అర్జున్ రెడ్డి’ తర్వాత సందీప్ బాలీవుడ్‌కు వెళ్లడమే ఇక్కడి జనాలకు నచ్చలేదు. కనీసం ఆ సినిమా పూర్తి చేసుకుని అయినా వస్తాడనుకుంటే.. ‘కబీర్ సింగ్’ నిర్మాతలతోనే తన తర్వాతి బాలీవుడ్ ప్రాజెక్టును అనౌన్స్ చేసి నిరాశకు గురి చేశాడు.

కనీసం ఆ సినిమా అయినా త్వరగా పూర్తి చేసి ఇటు వస్తాడనుకుంటే దాని సంగతి ఎటూ తేలలేదు. తన మూడో సినిమాను ప్రకటించాడు కానీ.. అందులో హీరో ఎవరన్నది తేలనే లేదు. రణబీర్ అయితే సందీప్‌కు కమిట్మెంట్ ఇచ్చినట్లు లేడు. అసలిప్పుడు ముందు అనుకున్న ప్రాజెక్టే క్యాన్సిల్ అయినట్లు వార్తలొస్తున్నాయి.

ఈ నేపథ్యంలోనే హిందీలో సందీప్ వెబ్ సిరీస్ చేస్తాడని కొందరు.. ఓ చిన్న సినిమాను స్వీయ నిర్మాణంలో తీయబోతున్నాడని ఇంకొందరు అంటున్నారు. కానీ ఏ విషయంలోనూ అధికారిక సమాచారం లేదు. ‘అర్జున్ రెడ్డి’తో తనపై భారీగా అంచనాలు పెంచి, ప్రేక్షకుల్లో ఎగ్జైట్మెంట్ తీసుకొచ్చిన దర్శకుడు మూడేళ్ల తర్వాత కూడా కొత్త కథతో సినిమా చేయకపోవడం అతడిపై ఆశలు పెట్టుకున్న వాళ్లను నిరాశ పరుస్తోంది. అతను బాలీవుడ్ విడిచిపెట్టి టాలీవుడ్‌కు వచ్చేసి విజయ్ దేవరకొండతోనో, మరో స్టార్‌తోనో సినిమా చేయాలని ఆశిస్తున్నారు ఇక్కడి ప్రేక్షకులు.