బంగారం లాంటి మార్కెట్ పాయె..

ఇండియా సహా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలు కొన్ని నెలలుగా కరోనాతో అల్లాడిపోతుండటానికి కారణం చైనా. ఆ దేశమే పుట్టించిందో.. వైరస్ దానంతట అదే పుట్టుకొచ్చిందో తెలియదు కానీ.. కరోనాకు జన్మస్థానం అయితే చైనానే. వైరస్ ద్వారా చేసిన నష్టం చాలదని.. సరిహద్దుల్లో భారత భూభాగాన్ని ఆక్రమించడమే కాక, మన సైనికుల ప్రాణాలు పోవడానికి కారణమైన చైనా పట్ల భారత్ తీవ్ర వ్యతిరేకతతో ఉందిప్పుడు. పాకిస్థాన్‌ తరహాలోనే చైనా బద్ద శత్రువులా మారిపోయింది ఇండియాకు. ఈ నేపథ్యంలోనే ఆ దేశంతో సాధ్యమైనంతగా సంబంధాలు తెంచుకోవడానికి ప్రయత్నిస్తోంది భారత్. ఉన్నపళంగా వాణిజ్య సంబంధాలన్నీ తెంచుకోలేక ఆ దేశానికి చెందిన యాప్స్ మీద నిషేధం విధించింది. అలాగే ఇక్కడి కొత్త ప్రాజెక్టుల్లో చైనా పెట్టుబడులు లేకుండా జాగ్రత్త పడుతోంది. ఇటు భారతీయులు, అటు చైనీయుల మధ్య ఒకరంటే ఒకరికి ద్వేష భావం కనిపిస్తోందిప్పుడు.

ఈ నేపథ్యంలో గత కొన్నేళ్లుగా భారతీయ సినిమాకు మంచి మార్కెట్‌గా మారుతూ వస్తున్న చైనాలో సమీప భవిష్యత్తులో ఇండియన్ మూవీస్ రిలీజయ్యే అవకాశాలు కనిపించడం లేదు. ఆమిర్ ఖాన్‌ అక్కడ దంగల్ సినిమాతో సూపర్ స్టార్ అయిపోయాడు. ఏకంగా 1200 కోట్లు కొల్లగొట్టింది ఆ చిత్రం అక్కడ. దీంతో అతను తర్వాత నటించిన, అంతకుముందు చేసిన సినిమాలు వరుసటెట్టి రిలీజ్ చేయడం మొదలు పెట్టారు. వాటికి మంచి ఫలితం వచ్చింది. వీటితో పాటు భజరంగి భాయిజాన్, హిందీ మీడియం లాంటి సినిమాలు వందల కోట్లు కొల్లగొట్టాయి. ఐతే ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో కొన్నేళ్ల పాటు చైనాలో భారతీయ సినిమాలేవీ రిలీజయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ముఖ్యంగా ఈ విషయంలో ఆమిర్ ఖాన్ చాలా ఫీలవుతుంటాడేమో. చైనా మార్కెట్ పుణ్యమా అని అతడి రేంజ్ డబులైంది. ‘లాల్ సింగ్ చద్దా’ను అక్కడ భారీ స్థాయిలో రిలీజ్ చేయాలనుకున్నాడు. ఐతే ప్రస్తుతం రెండు దేశాల సంబంధాల్ని బట్టి చూస్తే మన సినిమాల్ని అక్కడ రిలీజ్ చేయడానికి రెండు వైపుల నుంచి అనుమతులు కష్టమే కావచ్చు. అంతే కాదు.. అక్కడి జనాలు కూడా మన సినిమాలు చూసేందుకు ముందుకు రాకపోవచ్చు. కరోనా దెబ్బకు ఇప్పటికే కుదేలైన బాలీవుడ్.. బంగారం లాంటి చైనా మార్కెట్‌ను కూడా కోల్పోవడం విచారకరమే.