లాక్‌డౌన్ పొడిగింపుపై కేసీఆర్ కొత్త మాట

ఏప్రిల్ 14 త‌ర్వాత తెలంగాణ‌లో లాక్ డౌన్ పొడిగించ‌డం ప‌క్కా అని ముందే జ‌నాల‌కు అర్థ‌మైపోయింది. ఈ దిశ‌గా ముఖ్య‌మంత్రి కేసీఆర్ చాలా ముందుగానే సంకేతాలు ఇచ్చేశారు.

కేంద్రం లాక్ డౌన్‌ను 14 త‌ర్వాత పొడిగిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించ‌డానికి ముందే ఆయ‌న తెలంగాణ‌లో పొడిగింపు గురించి ప్ర‌క‌ట‌న చేసేశారు. మ‌రి మే 3 త‌ర్వాత లాక్ డౌన్ ప‌రిస్థితేంటి.. తెలంగాణ‌లో ఏమైనా స‌డ‌లింపులుంటాయా.. అక్క‌డితో లాక్ డౌన్‌కు తెర‌ప‌డుతుందా అన్న ఉత్కంఠ అంద‌రిలోనూ ఉంది. ఐతే మిగ‌తా రాష్ట్రాల ప‌రిస్థితేంటో కానీ.. తెలంగాణ‌లో మాత్రం ప‌రిస్థితి మారేలా క‌నిపించ‌డం లేదు. మ‌రోసారి లాక్ డౌన్ పొడిగింపునకే తెలంగాణ సీఎం మొగ్గు చూపుతున్నారు.

తాజాగా మంత్రులు, అధికారుల‌తో నిర్వ‌హించిన ఉన్న‌త స్థాయి స‌మావేశంలో లాక్ డౌన్ పొడిగింపు దిశ‌గానే సంకేతాలిచ్చారు కేసీఆర్.


రాష్ట్రంలో క‌రోనా వైర‌స్ వ్యాప్తి కొంత నియంత్ర‌ణ‌లోనే ఉంద‌ని కేసీఆర్ ఈ స‌మావేశంలో చెప్పారు. క‌రోనా కేసులు ఎన్ని ఉన్న‌ప్ప‌టికీ.. మ‌ర‌ణాల రేటు జాతీయ స్థాయితో పోలిస్తే రాష్ట్రంలో త‌క్కువ ఉండ‌టం ఊర‌ట‌నిచ్చే విష‌య‌మ‌ని ఆయ‌న‌న్నారు. లాక్ డౌన్‌ను మ‌రి కొంత కాలం కొన‌సాగిస్తే, ప్ర‌జ‌లు ఎవ‌రికి వారు వ్య‌క్తిగ‌త ప‌రిశుభ్ర‌త‌, త‌గిన జాగ్ర‌త్త‌లు పాటిస్తే రాబోయే రోజుల్లో వైర‌స్ వ్యాప్తి పూర్తిగా త‌గ్గిపోయే అవ‌కాశ‌ముంద‌ని ఆయ‌న‌న్నారు.

సోమ‌వారం అన్ని రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌తో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ వీడియో కాన్ఫ‌రెన్స్ ఏర్పాటు చేశార‌ని.. సీఎంలంద‌రూ త‌మ రాష్ట్రాల్లో ప‌రిస్థితిని వివ‌రిస్తార‌ని.. దేశ‌వ్యాప్తంగా ప‌రిస్థితిపై ఈ స‌మావేశంలో ఓ అంచ‌నా వ‌స్తుంద‌ని కేసీఆర్ అన్నారు. త‌దుప‌రి చ‌ర్య‌ల‌పైనా ఈ స‌మావేశంలో అభిప్రాయాలు వెల్ల‌డువ‌తాయ‌ని.. త‌ద్వారా త‌దుప‌రి కార్యాచర‌ణ‌పై స్ప‌ష్ట‌త వ‌స్తుంద‌ని ఆయ‌న‌న్నారు. తెలంగాణ స్టాండ్ అయితే లాక్ డౌన్ పొడిగింపే అని కేసీఆర్ చెప్ప‌క‌నే చెప్పేశారు