చిరు, నాగ్, వెంకీ మల్టీస్టారర్.. ‘త్రివేణి సంగమం’

మిగిలిన భాషలతో పోలిస్తే తెలుగులో మల్టీస్టారర్స్ చాలా తక్కువ. ఫ్యాన్స్ ఒప్పుకోరనే కారణంగా మరో హీరోతో స్క్రీన్ షేర్ చేసుకోవడానికి వెనుకాడుతుంటారు తెలుగు స్టార్లు. అయితే ఈ మధ్య మన హీరోలు కూడా మారుతున్నారు.

‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ మూవీ కోసం విక్టరీ వెంకటేశ్, సూపర్ స్టార్ మహేష్‌బాబు చేతులు కలిపితే… ఇప్పుడు ‘ఆర్ఆర్ఆర్’లో ఎన్టీఆర్, రామ్ చరణ్‌‌ స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. అయితే వీటన్నింటికంటే ముందే ఓ భారీ మల్టీస్టారర్ ప్లాన్ చేశారట శతాధిక చిత్రాల దర్శకుడు కె. రాఘవేంద్రరావు.

కెరీర్‌లో ఎన్నో ఇండస్ట్రీ హిట్స్ అందుకున్న దర్శకేంద్రుడు కె. రాఘవేంద్ర రావు… తన నూరో చిత్రంగా ఓ భారీ మల్టీస్టారర్ అనుకున్నారట. సీనియర్ స్టార్ త్రయం మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేశ్‌‌లు హీరోలుగా ఓ ప్రాజెక్ట్ ప్లాన్ చేశారట. దీనికి ‘త్రివేణి సంగమం’ అని టైటిల్ కూడా ఫిక్స్ చేశారట. అయితే ముగ్గురు స్టార్లను ఒకే స్క్రీన్ మీద చూపించాలని దర్శకేంద్రుడు చేసిన ఈ ప్రయత్నం వర్కవుట్ కాలేదు.

దాంతో అల్లుఅర్జున్‌ను హీరోగా పరిచయం చేస్తూ తన 100వ చిత్రంగా ‘గంగోత్రి’ని చేశారు రాఘవేంద్రుడు. టాప్ స్టార్లు చిరంజీవి, నాగ్, వెంకీ ఒకే సినిమాలో కనిపిస్తే… అది పెను సంచలనం క్రియేట్ చేసి ఉండేది.

ఆ టైమ్‌లో వారికున్న క్రేజ్‌కు బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిసేది. టాలీవుడ్‌లో ప్రయోగాత్మక చిత్రాలు కూడా పెరిగేవి. అప్పట్లో వర్కవుట్ కాకపోయినా ‘త్రివేణి సంగమం’ స్క్రిప్ట్ మీద ఉన్న నమ్మకంతో ఎప్పటికైనా ఈ ప్రాజెక్ట్ తెరకెక్కించాలనే గట్టి పట్టుదలతో ఉన్నారట రాఘవేంద్రరావు. అదీగాక ఇప్పుడు స్టార్లలతో పాటు ఫ్యాన్స్ ఆలోచనావిధానం కూడా మారింది. కంటెంట్‌‌ ఉంటే ప్రయోగాత్మక చిత్రాలను కూడా ఆదరిస్తున్నారు తెలుగు జనాలు. అందుకే ఈ మెగా, అక్కినేని, దగ్గుపాటి మల్టీస్టారర్‌ పర్ఫెక్ట్‌గా వర్కవుట్ అవుతుందనే ధీమాగా ఉన్నారు దర్శకేంద్రుడు.

ఇకపోతే ‘శ్రీరామదాసు’ తర్వాత సరైన సక్సెస్ అందుకోకపోయిన రాఘవేంద్రుడు… ‘ఓం నమో వెంకటేశాయ’ తర్వాత మళ్లీ మెగాఫోన్ పట్టలేదు. వీలైతే త్వరలో ఈ ప్రాజెక్ట్‌ పట్టాలెక్కించేందుకు దర్శకుడిగా మారిన తన తనయుడు ప్రకాశ్‌కు ‘త్రివేణి సంగమం’ బాధ్యతలు అప్పగించారని టాక్ వినిపిస్తోంది.