సీబీఐ సంచలనం… డాక్టర్ సుధాకర్ కేసులో కుట్ర ఉంది

ఏపీలో సస్పెండ్ అయ్యి కొంతకాలం తర్వాత అరెస్టయిన దళత డాక్టర్ సుధాకర్ కేసు కొత్త మలుపు తిరిగింది. 8 వారాల్లో సుధాకర్ కేసును ఛేదించాలని హైకోర్టు ఆ కేసును సీబీఐకి అప్పగించిన సంగతి తెలిసిందే. అంతర్జాతీయ పత్రికలకు కూడా ఎక్కిన ఈ కేసులో కుట్ర కోణం ఉందని సీబీఐ తేల్చి చెప్పింది. హైకోర్టులో ఈరోజు పిటిషను దాఖలు చేసిన సీబీఐ మరింత సమయం కావాలని పేర్కొంది. సీబీఐ వినతి మేరకు ఈ కేసు దర్యాప్తులో పూర్తి చేయడానికి ఏపీ హైకోర్టు మరో రెండు నెలల గడువు ఇచ్చింది.

విశాఖ జిల్లా నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో డాక్టర్‌ సుధాకర్‌ అనస్తీషియస్టుగా పనిచేస్తున్నారు. కరోనా తొలినాళ్లలో మాస్కుల కొరతపై మీడియా ముందు అసంతృప్తి వ్యక్తంచేశారు. అదేవారంలోనే అతను సస్పెండ్ అయ్యారు. సడెన్ గా కొంతకాలానికి విశాఖపట్నం రోడ్డుపై గుండుతో రోడ్డు మీద పోలీసులతో దెబ్బలు తింటూ ప్రత్యక్షం అయ్యారు. రోడ్డు మీద అతన్ని పోలీసులు కొట్టడం, తర్వాత ప్రభుత్వాన్ని అతను దుర్భాషలాడటం వీడియోలో కనిపించింది. తర్వాత అతను అరెస్టయ్యారు. అతన్ని మానసిక ఆస్పత్రికి తరలించారు. ఇది వివాదమై కోర్టుకెళ్లింది.

పోలీసు నివేదికకు, కోర్టు జడ్జితో విచారణ చేయించిన నివేదికకు తేడాలుండటంతో పోలీసులపై హైకోర్టు అనుమానం వ్యక్తంచేసింది. అనంతరం దీనిని వేగవంతమైన లోతైన దర్యాప్తుకోసం గడువుపెట్టి మరీ సీబీఐకి అప్పగించింది. రంగంలోకి దిగిన సీబీఐ… ఈరోజు మొత్తం వ్యవహారంపై పిటిషను దాఖలు చేసింది. కుట్ర కోణం ఉందని పేర్కొంటూ… మరింత సమయం కోరగా హైకోర్టు అనుమతించింది.

సీబీఐ వ్యాఖ్యలు ఏపీలో రాజకీయ కలకలానికి దారితీశాయి.