డీజీపీ సవాంగ్ కు చంద్రబాబు లేఖ

ఏపీలో దళితులపై దాడులు పెరిగిపోతున్నాయంటూ ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీ తీవ్ర ఆరోపణలు చేస్తోన్న సంగతి తెలిసిందే. విశాఖ జిల్లా పెందుర్తిలోని టాలీవుడ్‌ నిర్మాత, నటుడు నూతన్‌ నాయుడు ఇంట్లో దళిత యువకుడి శిరోముండనం ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. దీంతోపాటు, డాక్టర్ సుధాకర్ కేసు, కొందరు జర్నలిస్టులపై దాడి….ఇలా వరుస ఘటనలపై టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ఏపీల శాంతి భద్రతలు నానాటికీ క్షీణిస్తున్నాయంటూ ఏపీ డీజీపీ గౌతం సవాంగ్‌కు ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. గత ఏడాది కాలంగా రాష్ట్రంలో శాంతి భద్రతలు దారుణమైన స్థితికి చేరుకున్నాయని, దోపిడిదారులు, గుండాలు, మాఫియా శక్తులు ఏపీని ఆటవిక రాజ్యంగా మార్చాయని ఆరోపించారు. ఏపీలో బడుగుబలహీన వర్గాల వారిపై గంపగుత్త దాడులు, చట్ట ఉల్లంఘనల, ప్రాథమిక హక్కులను కాల రాయడం వంటివి నిత్యకృత్యమయ్యాయని చంద్రబాబు ఆరోపించారు.

ప్రజాస్వామ్యాన్నే ప్రమాదంలోకి నెట్టారని, మీడియాపై కూడా వరుస దాడులు చేస్తున్నారని లేఖలో చంద్రబాబు పేర్కొన్నారు. తుని, నెల్లూరు, చీరాల ప్రాంతాల్లో జర్నలిస్టులపై దాడులు జరిగాయని, పుంగనూరులో జర్నలిస్ట్ వెంకట నారాయణ ఇంటిపై వైసీపీ కార్యకర్తలు దాడి చేయడంతో ఆ వ్యవహారం బయటకు రాకుండా పోలీసులు తొక్కిపెడుతున్నారన్న ఆరోపణలున్నాయని లేఖలో పేర్కొన్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తోన్న పుంగనూరులో ఇటీవల ఇద్దరు దళితులు అనుమానాస్పదంగా మరణించారని, అక్కడి శాంతి భద్రతలకు ఈ దుర్ఘటనలే దుష్ట్యాంతాలని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు. పుంగనూరుతోపాటు ఏపీ మొత్తం శాంతిభద్రతలు క్షీణించాయని, జర్నలిస్ట్ లపై దాడే అందుకు సాక్ష్యమని అన్నారు. ఫోర్త్ ఎస్టేట్ లాంటి మీడియాపై దాడులు కొనసాగితే ప్రజాస్వామ్యం ఉనికినే కోల్పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. నేరస్థులపై కఠిన చర్యలు తీసుకొని ఈ తరహా దాడులు పునరావృతం కాకుండా చూడాలని కోరారు. జర్నలిస్ట్ వెంకట నారాయణపై దాడి ఘటన వీడియో క్లిప్పింగ్‌లను లేఖతో పాటు చంద్రబాబు జత చేశారు.