కొత్త ఆశలు పుట్టిస్తున్న రికవరీ రేటు

క్యాలెండర్ లో తేదీలు మారుతున్నాయి. ఒకటి తర్వాత ఒకటిగా లాక్ డౌన్ పొడిగింపు నిర్ణయం వచ్చేస్తోంది. ప్రస్తుతం లాక్ డౌన్2.0 నడుస్తోంది. దేశంలో ఇప్పుడు నెలకొన్న పరిస్థితుల్ని చూస్తుంటే.. రానున్న రోజుల్లోనూ పరిస్థితిలో మార్పు వెంటనే వచ్చేస్తుందన్న ఆశ ఎవరికి లేదు.

కరోనాను అంటించుకోవటం సులువే కానీ.. వదిలించుకోవటం ఎంత కష్టమన్న విషయం ప్రపంచానికే అర్థమైంది. ఇలాంటివేళ.. దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో పరిస్థితి ఆశావాహకంగా ఉంటే.. మరికొన్ని రాష్ట్రాల్లో వైరస్ విస్తరణ పెరుగుతోంది. ఇలాంటి కష్టకాలంలో అంతో ఇంతో ఊరటనిచ్చే అంశం ఏమైనా ఉందంటే అది.. రికవరీ రేటుగా చెప్పాలి.

పలు అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే కరోనా కట్టడి భారత్ ముందున్న విషయాన్ని తాజాగా కేంద్రం ప్రకటించింది. కరోనా విసిరే సవాళ్లను ఎప్పటికప్పుడు ఎదుర్కోవటమే కాదు.. అప్పటికున్న పరిస్థితులకు అనుగుణంగా స్పందించే విషయంలో మిగిలిన వారితో పోలిస్తే మనం బాగున్నట్లుగా చెప్పుకొచ్చింది కేంద్ర ఆరోగ్య శాఖ. దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 20 శాతంగా ఉన్నట్లు చెబుతున్నారు.

దేశంలో కరోనా కేసుల పెరుగుదల భారీగా లేదని.. గడిచిన ముప్ఫై రోజుల్లో వైరస్ ను కట్టడి చేయటంలో దేశం విజయం సాధించినట్లుగా చెప్పుకొచ్చారు. లాక్ డౌన్ నిర్ణయంతో మంచే జరిగిందని పేర్కొంది. మార్చి 23 నాటికి దేశంలో 400 కేసులు నమోదు కాగా.. నెల రోజుల వ్యవధిలో ఈ సంఖ్య 20వేలకు చేరింది. ఇప్పటివరకూ ఐదు లక్షల మందికి పరీక్షలు నిర్వహించారు.

ఊరటనిచ్చే అంశం ఏమంటే.. గడిచిన పద్నాలుగు రోజుల్లో దేశంలోని 78 జిల్లాల్లో ఒక్కటంటే ఒక్క కేసు కూడా నమోదు కాకపోవటం విశేషం. ఇతర దేశాలతో పోలిస్తే కరోనా కట్టడి దేశంలో బాగుందన్న మాట వినిపిస్తోంది. కరోనా బాధితుల్లో 20 శాతం మంది కోలుకున్న వైనాన్ని పేర్కొన్నారు.

కరోనా ముప్పును ముందే గుర్తించిన కేంద్రం లాక్ డౌన్ నిర్ణయాన్ని సమయానికి అనుగుణంగా తీసుకోవటం లాభంగా మారిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏమైనా.. కరోనా కష్టకాలంలో సానుకూల అంశం చోటు చేసుకోవటం దేశ ప్రజలకు ఊరటనిస్తుందని చెప్పక తప్పదు.