క‌రోనా దెబ్బ‌కు సీఎం కుర్చి పోయేలాగ ఉందే

కొంద‌రికి గుడ్ న్యూస్‌లో బ్యాడ్ టైం భ‌లే దారుణంగా ఉంటుంది. ఊహించ‌ని రీతిలో సీఎం ప‌ద‌విని కైవ‌సం చేసుకున్న శివ‌సేన నేత ఉద్ద‌వ్ ఠాక్రేకు క‌రోనా ఎఫె‌క్ట్ మామూలుగా త‌లిగేలా లేదు. ఏకంగా ఆయ‌న సీఎం సీటును కోల్పోయే ప‌రిస్థితి త‌ప్పేలా లేదు.

ఎన్సీపీ, కాంగ్రెస్‌ మద్దతుతో గతేడాది నవంబర్‌ 28న సీఎంగా ప్రమాణం చేసిన ఉద్ధవ్‌.. మే 28లోగా ఆయన ఎమ్మెల్యే/ ఎమ్మెల్సీగా ఎన్నిక కావటం తప్పనిసరి. ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల‌కంటే ప‌రోక్ష ఎన్నిక‌ల్లో ఎమ్మెల్సీ అవ్వాల‌ని ఉద్ద‌వ్ ఠాక్రే భావించారు. ఎమ్మెల్సీగా ఎన్నికవ్వాలని భావించగా కరోనా నేపథ్యంలో ఎన్నికలు వాయిదా పడ్డాయి. దీంతో ఇప్పుడు ఉద్ద‌వ్ సీటుపై చ‌ర్చ జ‌రుగుతోంది.

ఉద్ద‌వ్ ఠాక్రేను ఎమ్మెల్సీగా నియమించాలని మహారాష్ట్ర మంత్రివర్గం తీర్మానం చేసి గ‌వ‌ర్న‌ర్‌కు పంపించింది. అయితే, మ‌హా కేబినెట్ చేసిన విజ్ఞప్తిని గవర్నర్‌ పరిగణనలోకి తీసుకోలేదు. దీంతో ఉద్ధవ్‌ సీఎం పీఠంపై నీలినీడలు అలుముకుంటున్నాయి.

ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో ఠాక్రే ఎలాగైనా చ‌క్రం తిప్పి ఎమ్మెల్సీగాఎన్నికవ‌డం లేదా త‌న ప‌ద‌వికి చేయ‌డం తప్ప‌‌‌దంటున్నారు. కరోనా ప్రభావంతో మహారాష్ట్రలో పొంచి ఉన్న రాజ్యాంగ సంక్షోభానికి పరిష్కారం కనుగొనకపోతే సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే తన పదవికి రాజీనామా చే‌యాల్సి ఉంటుంది.

ఇదిలా ఉండ‌గా, మ‌హారాష్ట్ర ముఖ్యమంత్రి అధికారిక నివాసాన్ని కరోనా వైరస్‌ తాకింది. వర్ష బంగ్లా వద్ద విధులు నిర్వర్తిస్తున్న అసిస్టెంట్‌ పోలీసు ఇన్‌స్పెక్టర్‌కు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు ముంబయి పోలీసులు వెల్లడించారు. పోలీసు ఇన్‌స్పెక్టర్‌తో సన్నిహితంగా మెలిగిన మరో ఆరుగురిని క్వారంటైన్‌ సెంటర్‌లో ఉంచారు పోలీసులు. పోలీసు ఇన్‌స్పెక్టర్‌కు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో వర్ష బంగ్లాతో పాటు పరిసర ప్రాంతాలను పారిశుద్ధ్య కార్మికులు శానిటైజ్‌ చేశారు.

కరోనా పాజిటివ్‌ కేసుల్లో మహారాష్ట్ర మొదటి స్థానంలో నిలిచింది. దేశ వ్యాప్తంగా 20 వేల కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైతే.. ఒక్క మహారాష్ట్రలోనే 5,218 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. మహారాష్ట్రలో ఇప్పటి వరకు కరోనాతో 251 మంది మృతి చెందగా, దేశ వ్యాప్తంగా 645 మంది చనిపోయారు. ముంబయిలో కరోనా కేసులు అధికంగా నమోదు అవుతున్నాయి.