షాకింగ్ అనుభవం: లక్షణాలు లేకున్నా కరోనా పాజిటివ్

కరోనాకు సంబంధించి కొత్త కొత్త అంశాలు బయటకు వస్తున్నాయి. కొద్దిమందిలో బాగున్నట్లే ఉన్నా.. బ్లడ్ శాంపిల్ ను పరీక్షిస్తే మాత్రం అందులో కరోనా పాజిటివ్ అని వస్తున్న వైనం షాకింగ్ గా మారింది. తాజాగా అలాంటి అనుభవమే హైదరాబాద్ కు చెందిన ఒక వ్యక్తికి ఎదురైంది. దీనికి సంబంధించిన తన అనుభవాన్ని అతడు సోషల్ మీడియాలో పేర్కొన్నాడు. విన్నంతనే ఉలిక్కిపడేలా ఉన్న ఇతగాడి అనుభవంలో సానుకూల అంశం ఏమంటే.. లండన్ నుంచి హైదరాబాద్ ఎయిర్ పోర్టులో దిగిన తర్వాత థర్మల్ స్కానింగ్ లో ఏమీ లేదని వచ్చినా.. అనుమానంతో బ్లడ్ టెస్టు చేయించుకోవటం.. పాజిటివ్ అని తేలటంతో ప్రస్తుతం గాంధీలోని ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతున్నాడు.

తన అనుభవాన్ని ఆయన వెల్లడించారు. మార్చి 20న ఇండియాకు వచ్చా. కరోనా మీద అవగాహనతో బ్లడ్ టెస్టు చేయించుకుంటే పాజిటివ్ అని వచ్చింది. ప్రస్తుతం గాంధీలో చికిత్స పొందుతున్నా. కరోనా గురించి తెలుసు కాబట్టి.. కుటుంబ సభ్యుల్ని.. బంధుమిత్రుల్లో ఎవరిని కలవలేదు. దీంతో.. మా ఇంట్లోని వారు ఐసోలేషన్ వార్డులో ఉండాల్సిన పరిస్థితి రాలేదు. కరోనా వైరస్ ఊహించనంత తీవ్రమైనది. ఈ వైరస్ సోకిన ప్రతిఒక్కరిలోనూ రోగ లక్షణాలు కనిపించాలని ఏమీ లేదు. నాకే కాదు.. నాతో పాటు చికిత్స పొందుతున్న పలువురిలో రోగ లక్షణాలు లేకున్నా కరోనా పాజిటివ్ వచ్చింది. లక్షణాలు లేవని వైరస్ సోకలేదని అనుకోవద్దు. దీన్ని సులువుగా ఎదుర్కోవచ్చని ఎప్పుడూ అనుకోవద్దు’’ అని పేర్కొన్నారు.

‘‘విదేశాల నుంచి వచ్చిన వారు తప్పనిసరిగా వైద్య పరీక్షలు చేయించుకోవాల్సిందే. వైరస్ శరీరంలోకి చేరిన తర్వాత నెమ్మదిగా రోగ నిరోధక శక్తిని లోబర్చుకుంటుంది. నెమ్మదిగా శరీరంలో బలహీనంగా ఉంటుంది. మీ శరీరం దేనితోనో పోరాడుతున్న అనుభూతి కలుగుతుంది. అప్పుడే మీకు వైరస్ ఉన్నట్లు అర్థమవుతుంది. ప్రస్తుతం నేనూ ఇలాంటి స్థితిలోనే ఉన్నా. ఇలాంటి సందర్భంలోనే మానసికంగా బలంగా ఉండాలి. వ్యాధిని జయిస్తాననే విశ్వాసంతో ఉంటే.. కరోనాను జయించొచ్చు’’ అని చెప్పారు.

‘‘వైరస్ లేదన్న ధీమాతో కొందరు.. సామాజికంగా ఇబ్బందులు ఎదురవుతాయన్న తప్పుడు భావనతో కరోనా పరీక్షలు కొందరు చేయించుకోవటం లేదు. విదేశాల నుంచి వచ్చిన ప్రతిఒక్కరూ బాధ్యతగా బ్లడ్ టెస్టులు చేయించుకుంటే మంచిది. ఈ చైన్ నుబ్రేక్ చేయాలంటే ఎవరికి వారు బాధ్యతగా వ్యవహరించాలి. అందుకు భిన్నంగా వ్యవహరిస్తే.. ఈ రోగం వచ్చిందన్న విషయం తెలిసి.. అర్థమయ్యేలోపు చనిపోయినా ఆశ్చర్యం లేదు. కరోనాతో ఆసుపత్రిలో చేరటం సిగ్గుపడే అంశం ఎంతమాత్రం కాదన్నది మర్చిపోవద్దు. కరోనాను ముందే గుర్తించటంతో ఎంతోమందికి ప్రాణాపాయం తప్పుతుందన్నది మర్చిపోవద్దు’’ అని వెల్లడించారు. ఇతడి అనుభవాన్ని ప్రతిఒక్కరు కేస్ స్టడీగా తీసుకొని.. ఎవరికి వారు ముందస్తు జాగ్రత్తతో ఉంటే.. కరోనాను అధిగమించటం కష్టం కాకపోవచ్చు.