ఈసారి ప్రెస్ మీట్లో జగన్ ఏం మాట్లాడాడు?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ అనగానే సోషల్ మీడియా జనాలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. జగన్ నోటి నుంచి ఈసారి ఏం ఆణిముత్యాలు దొర్లుతాయి.. వాటి మీద ఏం మీమ్స్ వేద్దాం.. ఎలా ట్రోల్ చేద్దామని మీమ్ క్రియేటర్లతో పాటు వ్యతిరేకులు కాచుకుని కూర్చుని ఉన్నారు.

కరోనా వైరస్ నేపథ్యంలో జగన్ పెడుతున్న ప్రెస్ మీట్లు అంత కామెడీగా.. వివాదాస్పదంగా మారుతున్నాయి మరి. పది రోజుల కిందట ‘పారాసిటమాల్’, ‘బ్లీచింగ్ పౌడర్’, ‘దట్ కమ్స్.. దట్ గోస్’.. ‘దిస్ ఈజ్ గోయింగ్ టు బి నిరంతర ప్రక్రియ’, ‘కరోనాతో ఎవరూ చనిపోరు’ లాంటి కామెంట్లతో జగన్ ఎంతగా అన్ పాపులర్ అయ్యాడో తెలిసింది. తర్వాతి ప్రెస్ మీట్లో కరోనా పుట్టింది దక్షిణ కొరియాలో అంటూ మరోసారి వ్యతిరేక వర్గాలకు దొరికిపోయాడు.

దీంతో జగన్ లేటెస్ట్ ప్రెస్ మీట్ కోసం అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. గురువారం సాయంత్రం జగన్ కరోనా మీద మళ్లీ ప్రెస్ మీట్ పెట్టాడు. ఈ ప్రెస్ మీట్ ద్వారా ప్రధానంగా జగన్ ఇచ్చిన సందేశం.. జనాలు ఎక్కడి వాళ్లు అక్కడే ఉండాలని. దేశ ప్రధాని చెప్పిన మాటల్నే ఆయనా వల్లె వేశాడు. బుధవారం సాయంత్రం తెలంగాణ నుంచి వస్తున్న ఏపీ విద్యార్థులను కృష్ణా జిల్లాలో ఆపేయడం మీద జగన్ నర్మగర్భంగా స్పందించాడు.

తీవ్ర విమర్శలకు దారి తీసిన ఈ వ్యవహారంపై జగన్ మాట్లాడుతూ.. ప్రస్తుతం వాళ్లను చిరునవ్వుతో ఆహ్వానించే పరిస్థితి లేదన్నాడు. నిన్న జరిగిన ఘటనలు తన మనసును కలచి వేశాయన్నాడు. ఐతే ఎప్పట్లాగే జగన్ మాటల్లో కొన్ని తప్పులు దొర్లడంతో సోషల్ మీడియా జనాలకు పని పడింది. ‘27 వేల 7 వందల పద్దెనిమిది వందల పందొమ్మిది మంది’ అంటూ ఒక నంబర్ చెప్పాడు జగన్. ఇంకా ఇలాంటి కొన్ని తప్పులు దొర్లడంతో వాటిపై కామెడీ చేస్తున్నారు జనాలు.