ఏపీలో అంబులెన్సుల దుస్థితికిది నిదర్శనం

దేశంలోనే అత్యధికంగా కరోనా పరీక్షలు చేస్తున్న రాష్ట్రంగా జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంది జగన్ సర్కారు. అలాగే రికార్డు స్థాయిలో ఒకేసారి వెయ్యికి పైగా 104, 108 అంబులెన్సులను అందుబాటులోకి తేవడంపైనా ప్రశంసల జల్లు కురుస్తున్నాయి.

ఐతే ఏపీలో కరోనా పరీక్షల వెనుక డొల్లతనం ఈ మధ్యే బయటికి వచ్చింది. సేకరించిన శాంపిల్స్‌పై పర్యవేక్షణ కొరవడటంతో ఏకంగా 2 లక్షలకు పైగా శాంపిల్స్ వృథా అయిన వైనం వెలుగులోకి వచ్చింది. ఇది ఎంతటి దుష్పరిణామాలకు దారి తీసి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్పిన పని లేదు. ఆ రెండు లక్షల మందిలో కరోనా ఉండి కూడా అది నిర్ధారణ కాకపోవడం వల్ల ఏం జరిగి ఉంటుందో అంచనా వేయొచ్చు.

ఇక గత ప్రభుత్వ హయాంలో ఉన్న 600కు పైగా అంబులెన్సులకు కొత్తగా రంగులు వేసి వాటిని కొత్తగా ప్రవేశ పెట్టినట్లు జగన్ సర్కారు కలరింగ్ ఇవ్వడంపైనా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆ సంగతలా వదిలేస్తే కరోనా నిర్ధారణ అయిన పేషెంట్లను ట్రేస్ చేసి వారిని ఆసుపత్రుల్లో చేర్చడంలో, అక్కడ వసతులు కల్పించడంలోనూ అంత కట్టుదిట్టమైన వ్యవస్థ ఏమీ లేదని స్పష్టమవుతోంది.

ఓ వృద్ధురాలు కరోనా పాజిటివ్‌గా తేలాక ఆసుపత్రిలో 16 గంటల పాటు ఎదురు చూసి తిండి, వసతి రెండూ దొరక్క తిరిగి బస్సులో ప్రయాణించి ఇంటికి వెళ్లిపోయిన వైనం తాజాగా వెలుగులోకి వచ్చింది. మరోవైపు అనంతపురం జిల్లాలో ఓ ఆర్టీసీ డిపో మేనేజర్.. కరోనా పాజిటివ్‌గా తేలాక ఆసుపత్రికి వెళ్లేంత సేపు, అక్కడికి వెళ్లాక ఎలాంటి అవస్థలు పడింది వివరిస్తూ పెట్టిన ఆడియో సందేశం కూడా అవ్యస్థను తెలియజేస్తోంది.

ఇవన్నీ ఒకెత్తయితే.. కర్నూలు జిల్లాలో అంబులెన్సు కోసం ఎదురు చూసిన ఓ కరోనా పేషెంట్.. అది వచ్చాక అందులోకి ఎక్కే ముందు తీసిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. షేర్ ఆటో తరహాలో రెండంకెల సంఖ్యలో ఇరికించి ఇరికించి కరోనా పేషెంట్లను అంబులెన్సులో కుక్కిన వైనం చూసి అందరూ నివ్వెరపోయారు. ఈ పరిణామాలు చూసి ప్రభుత్వం మేల్కోకపోతే.. మరింతగా అప్రతిష్ట పాలు కావడం ఖాయం.