టీటీడీ మాస పత్రికతో పాటు క్రిస్టియన్ మ్యాగజైన్

ఏ ముహూర్తాన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిందో కానీ.. అప్పట్నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో ఏదో ఒక రగడ తప్పట్లేదు. టీటీడీ ఛైర్మన్‌గా నియమితుడైన ఎష్వీ సుబ్బారెడ్డి క్రిస్టియన్ అన్న ప్రచారం దగ్గర్నుంచి.. శ్రీవారి భూముల అమ్మకానికి జీవో ఇవ్వడం వరకు టీటీడీ చుట్టూ ఏదో ఒక వివాదం రాజుకుంటూనే ఉంది.

తిరుమలలో అన్యమత ప్రచారం చేయడం.. టీటీడీ వెబ్ సైట్లో క్రీస్తు సూక్తులు కనిపించడం లాంటి వ్యవహారాలు ఎంత దుమారం రేపాయో తెలిసిందే. ఇప్పుడు ఓ శ్రీవారి భక్తుడికి టీటీడీ మాస పత్రిక సప్తగిరితో పాటుగా ఓ క్రిస్టియన్ మ్యాగజైన్ కలిపి పోస్టులో రావడం వివాదాస్పదమైంది. గుంటూరుకు చెందిన ఓ భక్తుడు నెలనెలా టీటీడీ మాస పత్రిక సప్తగిరి తెప్పించుకుంటాడు. ఐతే తాజా పార్శిల్లో ‘సప్తగిరి’తో పాటు ‘సజీవ సువార్త’ అనే క్రిస్టియన్ మ్యాగజైన్ కూడా వచ్చింది.

అది చూసి షాక్ తిన్న ఆ భక్తుడు మీడియాకు సమాచారం అందించాడు. పార్శిల్లోని రెండు మ్యాగజైన్లను విప్పి చూపించాడు. శ్రీవారి భక్తుడైన తనకు క్రిస్టియన్ మ్యాగజైన్ చూసి మనోభావాలు దెబ్బ తిన్నట్లు అతను చెప్పాడు. దీనిపై టీటీడీ అధికారులు వివరణ ఇవ్వాలని కోరాడు. ఐతే తమ వైపు నుంచి తప్పేమీ జరగలేదని.. మధ్యలో ఎవరో దురుద్దేశపూర్వకంగా ఇలా చేశారని టీటీడీ వివరణ ఇచ్చింది. టీటీడీ పుస్తకాల్ని పోస్టల్ శాఖే పాఠకులకు చేరవేస్తుంది.

మధ్యలో ఎవరైనా ఇలా పార్శిల్‌లో క్రిస్టియన్‌ మ్యాగజైన్‌ను పెట్టి ఉంటారా.. లేక టీటీడీలోనే ఎవరైనా కావాలనే ఈ పని చేసి ఉంటారా అని అనుమానిస్తున్నారు. ఐతే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సహా వైకాపా నేతల్లో చాలామంది క్రిస్టియన్లు కావడంతో రాష్ట్రంలో క్రైస్తవ మత ప్రచారంతో పాటు మత మార్పిడి కూడా పెద్ద ఎత్తున జరుగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్న సమయంలో ఈ పరిణామం చర్చనీయాంశమైంది.