కేసీఆర్ కు కొత్త తలనొప్పిగా విజయసాయి ట్వీట్

పోలిక మానవ నైజం. అందునా రాజకీయాల గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. రెండు తెలుగు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత.. ఏదైనా విషయంలో ఒక రాష్ట్రం విజయం సాధించిన వెంటనే.. రెండో రాష్ట్ర పాలకుల పని తీరుతో పోల్చటం ఈ మధ్యన ఎక్కువ అవుతోంది. ఒకేలాంటి అంశాల్ని ఇద్దరు ముఖ్యమంత్రులు ఎలా డీల్ చేస్తున్నారన్న అంశంపైనా ఆసక్తి పెరిగింది.

ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారిని కంట్రోల్ చేసే విషయంలో ఏ దేశానికి ఆ దేశం.. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం తమకు తోచినట్లుగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. దేశంలో మొదట కేసు నమోదైన కేరళలో.. కేసులు పెరిగినట్లు కనిపించినా.. మహమ్మారిని అదుపు చేయటమే కాదు.. అతి తక్కువ మరణాలు నమోదయ్యేలా చేయటంలో సక్సెస్ అయ్యారనే చెప్పాలి. మరే రాష్ట్రంలో కుదరని తీరులో కేరళ ప్రభుత్వం కరోనాను కంట్రోల్ చేయగలిగింది. కొన్ని రాష్ట్రాలైతే కేరళ మోడల్ ను ఫాలో కావాలన్న నియమాన్ని పెట్టుకుంది.

రెండు తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. తొలినాళ్లలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాలను చూసినోళ్లుంతా.. ఆయన కమిట్ మెంట్ ను.. సమస్యను డీల్ చేస్తున్న తీరుపైన ప్రశంసల వర్షం కురిపించారు. చివరకు కేసీఆర్ ప్రెస్ మీట్ పెడితే.. ఏపీ ప్రజలు సైతం ఎంతో ఆసక్తిగా వినేవారు. తమ రాష్ట్రంలో ఏమీ జరగట్లేదని.. తెలంగాణలో ప్రభుత్వం చాలా చురుగ్గా వ్యవహరిస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యేవి.

గడిచిన నెల.. నెలన్నర కాలంలో సీన్ రివర్స్ అయ్యింది. లాక్ డౌన్ వేళ చక్కటి పని తీరు ప్రదర్శించిన తెలంగాణ ప్రభుత్వం.. ఆన్ లాక్ 1.0 మొదలైన నాటి నుంచి మహమ్మారికి చెక్ చెప్పే విషయంలో వరుస తప్పులు చేసుకుంటూ పోతోంది. ఎక్కడ ఎవరు తప్పు చేస్తున్నా.. చివరకు ముఖ్యమంత్రి కేసీఆర్ పేరును ప్రభావితం చేస్తోంది. మరోవైపు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న చర్యల్ని చూస్తున్న తెలంగాణ ప్రజలు.. ఏపీలో పరిస్థితులు బాగున్నాయని భావిస్తున్నారు.

దీనికి తోడు రోజువారీగా నమోదవుతున్న కేసులు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఆ మధ్యలో తెలంగాణలో పోలిస్తే.. ఏపీలోనే ఎక్కువ కేసులు ఉండేవి. తాజాగా పరిస్థితి మారింది. రోజువారీగా చూస్తే.. ఏపీతో పోలిస్తే తెలంగాణలో ఎక్కువ కేసులు నమోదు కావటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మహమ్మారి నిర్దారణ కోసం చేసే పరీక్షలు మొదలు.. ప్రైవేటు ఆసుపత్రుల్లో బెడ్లు నిండిపోవటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు. రికార్డుస్థాయిలో పెరుగుతున్న కేసులు హైదరాబాద్ వాసుల్ని కలవరపాటుకు గురి చేస్తున్నాయి. ఇంట్లో నుంచి బయటకు రావాలంటే భయపడేలా చేస్తున్న పరిస్థితి.

ఇలాంటివేళ.. ఏపీలో తీసుకుంటున్న చర్యలకు సంబంధించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు.. సీనియర్ నేత విజయసాయి రెడ్డి చేసిన తాజా ట్వీట్ ఒకటి ఆసక్తికరంగా మారింది. కొత్త మెడికల్ కాలేజీలు.. హాస్పిటళ్లు.. పది రెట్లు పెరిగిన ఐసీయూ బెడ్లు.. వెంటిలేటర్లు.. కొత్తగా 108 అంబులెన్సులు.. పబ్లిక్ హెల్త్ కేర్ రంగాన్ని సాచ్యురేషన్ స్థాయికి దూసుకెళ్తోంది. ఆరోగ్య శ్రీ లోకరోనాను కూడా చేర్చారు సీఎం జగన్ అంటూ చేసిన ట్వీట్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇప్పుడు ఇబ్బందిగా మారుతుందని చెబుతున్నారు.

విజయసాయి ట్వీట్ లో పేర్కొన్న ఏ అంశంలోనూ.. తెలంగాణ ముందుండటం తర్వాత.. ఆ విషయాల్లోనే విమర్శలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో.. తెలంగాణ ముఖ్యమంత్రికి కొత్త తలనొప్పిగా మారిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తమ ప్రభుత్వం సాధించిన ప్రగతి గురించి చేసిన ట్వీట్..తమకు మిత్రుడైన కేసీఆర్ కు ఇబ్బందికరంగా మారుతుందని విజయసాయి ఆలోచించి ఉండరేమో?