మీరంతా ఏమయ్యారు బాసూ!?

స్టార్లతో సంబంధం లేకుండా తెర మీద ఎస్.ఎస్. రాజమౌళి అనే పేరు కనిపిస్తే చాలు, ఆ సినిమా క్రేజ్ ఆకాశాన్ని తాకుతుంది. బడ్జెట్‌, హీరోతో సంబంధం లేకుండా బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురుస్తుంది.  తొలిసారి రామ్ చరణ్, ఎన్టీఆర్‌లాంటి స్టార్టలతో మల్టీస్టారర్ చేస్తున్న జక్కన్న, లాక్‌డౌన్ టైమ్‌ను పర్ఫెక్ట్‌గా వాడుతున్నారు. ఓ వైపు ఎడిటింగ్ పనులను పర్యవేక్షిస్తూనే… ఇంటి నుంచే ఇంటర్వ్యూలు ఇస్తూ, షూటింగ్ పూర్తికాకముందే మూవీ ప్రమోషన్ కార్యక్రమాలు కానిచ్చేస్తున్నారు.

లాక్‌డౌన్ విధించి, దాదాపు నెల కావొస్తున్నా… రాజమౌళి, చిరంజీవి తప్ప మిగిలిన స్టార్లు ఎవ్వరూ పెద్దగా ఇంటర్వ్యూల్లో కనిపించడం లేదు. మరి వీళ్లంతా ఏమయ్యారు. ఎక్కడికి పోయారు. అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వస్తున్న ‘పుష్ఫ’ ఐదుభాషల్లో విడుదల కానుంది. తెలుగులో, మలయాళంలో బన్నీకి ఉన్న క్రేజ్‌కు ప్రమోషన్ చేయకపోయినా వర్కవుట్ అవుతుంది. మరి మిగిలిన భాషల సంగతేంటి? ఈ ఖాళీ టైమ్‌ను కరెక్ట్‌గా వాడుకుంటే ‘పుష్ఫ’కు కావాల్సినంత క్రేజ్ తేవచ్చు. కాని ‘పుష్ఫ’ టీమ్ మాత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసి వదిలేసింది.

అలాగే ప్రభాస్, మహేష్ బాబు, రామ్ చరణ్, ఎన్టీఆర్ లాంటి స్టార్లను చూడాలని, వారి తర్వాతి సినిమాల అప్‌డేట్స్ తెలుసుకోవాలని అభిమానులు ఎంతగానో ఆశపడుతున్నారు. అయితే వీళ్లు రాజమౌళిలా బయటికి రావడానికి ఎందుకు ఇష్టపడడం లేదు. బిజీ షెడ్యూల్స్‌, రెగ్యూలర్ షూటింగ్స్‌తో తీరిక లేకుండా ఉన్నప్పుడు ఇంటర్వ్యూలు ఇవ్వలేదంటే ఒకే… కానీ ఇంట్లో ఖాళీగా కూర్చుంటున్న ప్రస్తుత తరుణంలో కూడా ఇంటర్వ్యూలకు టైమ్ లేదా? లేక ఇంటర్వ్యూలు ఇస్తే, తమ క్రేజ్ తగ్గిపోతుందని భావిస్తున్నారా? కారణాలు ఏమైనా ఫ్యాన్స్ కంటే ఏదీ ముఖ్యం కాదని ప్రకటించే స్టార్స్, స్టార్ డైరెక్టర్స్ ఇప్పటికైనా ప్రేక్షకుల కోసం ముందుకు వచ్చి, ఇంటర్వ్యూలు ఇవ్వాలని జనం కోరుకుంటున్నారు.

లాక్‌డౌన్ కారణంగా ఇళ్లకే పరిమితమైన ఫ్యాన్స్‌కు ఈ చిన్న ఇంటర్వ్యూలు ఎంతో ఉత్సాహాన్ని నింపుతాయి. హీరోలు, దర్శకులకు కూడా మంచి పబ్లిసిటీ, ప్రమోషన్ జరుగుతుంది. కాబట్టి రెండు విధాలా లాభాలిచ్చే ఈ టైమ్‌ను వేస్ట్ చేయకండి బాసూ.